ఏమా సర్వే..! : కేసీఆర్ చేతిలో ఆ 30 మంది ఎమ్మెల్యేల భవిష్యత్
టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు జోరందుకున్నట్టుగా సమాచారం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, అందులోను ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన పార్టీ. అభివృద్ది, సంక్షేమానికి సంబంధించి ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం టీఆర్ఎస్ పై ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. పై స్థాయిలో సీఎం ఒక్కరే కష్టపడినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ది జరగదు. పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమవంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించాల్సిందే. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, పార్టీలోని ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఇందుకోసం సీఎం కేసీఆర్ ఏకంగా ఓ రహస్య సర్వేను కూడా జరిపించాడనే ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇందులో నిజా-నిజాలెంతో తెలియదు గానీ, ఆ సర్వే నివేదిక ఆధారంగానే కేసీఆర్ పార్టీ నేతల భవిష్యత్ ను డిసైడ్ చేస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. పనితీరు సరిగా లేని అవినీతి మరకలంటుకున్న ఎమ్మెల్యేలకు వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వవద్దని యోచిస్తున్న కేసీఆర్, అందుకోసం ఈ నివేదికను కూడా పరిగణలోకి తీసుకోనున్నారట.
ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. సర్వే ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్, 30 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు జాబితాలో తమ పేరెక్కడ ఉందోనన్న ఆందోళనలో ఉన్నారట.
సర్వే విషయాన్ని కేసీఆర్ తన అంతరంగీకుల వద్ద ప్రస్తావించడంతో ఈ విషయం బయటకు పొక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా.. ఇప్పటికే ఆయా నేతలు కూడా నష్ట నివారణ చర్యల్లో భాగంగా తమ పని తీరును మార్చుకుని సీఎం కేసీఆర్ దృష్టిలో నుంచి తప్పిపోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications