RMP డాక్టర్ నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థిని బలి..!
ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు జీవితం బలైంది. ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో జరిగింది. బోనాల పండుగ అని ఇంటికి వచ్చి కుటుంబీకులతో ఆనందంగా గడిపిన బాలిక ఇప్పుడు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆర్ఎంపీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చల్లా హేమశ్రీ (14) 8వ తరగతి చదువుతోంది. అయితే బోనాల పండగ సందర్భంగా ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. తిరిగి హాస్టల్ కు పంపిద్దామని అనుకునే లోపు హేమశ్రీ స్వల్పంగా అనారోగ్యానికి గురైంది. దాంతో వెంటనే హేమశ్రీను తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.

చిన్నారిని పరీక్షించిన ఆర్ఎంపీ వైద్యుడు ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. మరో ఇంజెక్షన్ ఇస్తున్న క్రమంలో హేమశ్రీ స్పృహ కోల్పోయింది. నోటి నుంచి నురగ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు హేమశ్రీను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అప్పటివరకూ తమ కళ్ల ముందు ఆడి పాడిన హేమశ్రీ విగతజీవిగా మారిన క్రమంలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యం చేసే సమయంలో ఆర్ఎంపీ మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆర్ఎంపీని వెతికే పనిలో ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆర్ఎంపీని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications