డెంగ్యూ డేంజర్: మహిళా న్యాయమూర్తి మృతి: మొన్న గోకుల్..నేడు జయమ్మ..!
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ పంజా విసురుతోంది. డెంగ్యూ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రముఖులకు సంబంధించిన సమాచారమే బయటకు వస్తోంది. అనేక ఆస్పత్రుల్లో ఈ వ్యాధి కారణంగా చికిత్స పొందతున్న వారు అనేక మంది ఉన్నారు. కొద్ది రోజులు క్రితం డెంగ్యూ కారణంగా బాల నటుడు గోకుల్ సాయి మరణించటం అందరినీ కలిచి వేసింది. ఈ విషాదం మర్చిపోక ముందే ఇప్పుడు మహిళా న్యాయమూర్తి డెంగ్యూ బారిన పడ్డారు. మహిళా న్యాయమూర్తి జయమ్మ హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాల మీద ఆందోళన వ్యక్తం అవుతోంది.
మహిళా న్యాయమూర్తి మృతి..
డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ లోని అనేక ఆస్పత్రుల్లో డెంగ్యూ కారణంగా చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉన్నట్లుగా చెబుతున్నారు.

ప్రధానంగా అనేక మంది చిన్న పిల్లలు ఈ జ్వరంతో చికిత్స తీసుకుంటున్నారు. అనేక మంది చిన్నారుల్లో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోవటం..తీవ్రంగా జ్వరం బారిన పడుతుండటంతో దీని పైన ఆస్పత్రుల్లో వైద్యులు సైతం ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు న్యాయమూర్తిగా ఉన్న మహిళ ఈ డెంగ్యూతో బాధ పడుతూ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించటంతో మరో సారి డెంగ్యూ తీవ్రత పైన ఆందోళన మొదలైంది.
మొన్న బాలనటుడు గోకుల్ సైతం..
కొద్ది రోజులు క్రితం డెంగ్యూ కారణంగా బాల నటుడు గోకుల్ సాయి మరణించారు. చిత్తూరు జిల్లాకు చెందిన గోకుల్ బాలకృష్ణ అభిమాని. ఆయనను చక్కగా అనుకరించడమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్లను కూడా అలవోకగా చెప్పగలడు. గోకుల్ బాలకృష్ణ డైలాగ్లు చెబుతున్న వీడియోలు సోషల్ అనేక సందర్భాల్లో వైరల్గా మారాయి. జీ తెలుగు ఛానెల్లో ప్రసారమయ్యే ఒక షోలో నటించి గుర్తింపు గోకుల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు రోజులు జ్వరంతో బాధపడిన గోకుల్ కు డెంగ్యూగా నిర్ధారించటంతో..తల్లి తండ్రులు వెంటనే బెంగుళూరులోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ మరణించాడు. గోకుల్ మరణం బాలకృష్ణ సహా పలువురు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఈ రెండు కేసులే కాదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అనేక ఆస్పత్రుల్లో ఎక్కవ మొత్తంలో ఇవే వ్యాధి బారిన పడిన వారి కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా.. ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు పోతున్న సమయంలో..ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.












Click it and Unblock the Notifications