కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..
ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద్దరణపై క్లారిటీ వస్తుందని భావన వ్యక్తమయ్యింది. అయితే సోమవారం సమావేశం జరగడం లేదు అని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. భేటీ ఎందుకు జరగడం లేదో కూడా స్పష్టత ఇచ్చారు.
నో మీట్..
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో సోమవారం భేటీ జరగడం లేదని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. కిలోమీటర్ ప్రాతిపదికన అధికారుల ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఒప్పందం కుదిరే వరకు అధికారుల స్థాయి సమావేశాలు మాత్రం కొనసాగుతాయని ఆయన వివరించారు.
నిలిచిన బస్సు సేవలు..
మార్చి చివరి వారంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అన్ లాక్ ప్రక్రియ అమలు జరుగుతున్నా కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు మోక్షం కలగలేదు. ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాలు తమ సరిహద్దు ప్రాంతాల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాకు 1,184 బస్సులను నడిచేవి. ఆంధ్రప్రదేశ్కు 698 బస్సులు వెళ్లనుండగా.. ఏపీకి చెందిన బస్సులు 900 వరకు తెలంగాణకు వచ్చేవి. ఏపీ బస్సులు ఎక్కువగా నడవడం, తెలంగాణ బస్సులు తక్కువగా తిరుగుతుంది. దీంతో ఏపీతో ఒప్పందం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
900 బస్సులు.. 3 లక్షల కిలోమీటర్లు..
ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 900 బస్సులు రోజుకు 3 లక్షల కిలోమీటర్ల మేర తిరిగేవి. తెలంగాణ బస్సులు మాత్రంలో ఏపీలో 1.5 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరిగేవి. ఇది తమకు నష్టదాయకంగా ఉందని, కిలోమీటర్ల ప్రాతిపదికన ఒప్పందాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీ బస్సులు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో, తెలంగాణ బస్సులు కూడా ఏపీలో అన్నే కిలోమీటర్లు తిరుగాలన్నది దీని ఉద్దేశం. కానీ దీనిపై చర్చించేందుకు ఏపీ సుముఖంగా లేదు. దీంతో చర్చల ప్రక్రియకు ప్రతిష్టంభన ఏర్పడుతూనే ఉంది.