ప్లాన్ ప్రకారమే ఈటల దంపతులపై టీఆర్ఎస్ దాడి! పల్లానే దాడి చేయించారంటూ ఫైర్
నల్గొండ: మునుగోడులో ఓడిపోతామని తెలిసి.. టీఆర్ఎస్ దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై పలివెలలో జరిగిన రాళ్లదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మునుగోడులో ఈటల రాజేందర్ తో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వ్యూహం ప్రకారమే ఈటల రాజేందర్పై దాడి: కిషన్
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో హింసను ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్నారు. ఈటల, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపించారు. వ్యూహం ప్రకారమే ఈటల రాజేందర్, ఆయన భార్యపై దాడికి పాల్పడ్డారని కిషన్ రెడ్డి అన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులతో వచ్చి దాడి చేశారన్న కిషన్
మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్ ఈ దాడులు చేస్తోందని మండిపడ్డారు. డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని దాడికి పాల్పడ్డారన్నారు. ఇంత జరిగినా గొడవ జరగొద్దనే ఉద్దేశంతోనే ఈటల రాజేందర్ సంయమనం పాటించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి తన సభను కూడా అడ్డుకున్నారన్నారు.
టీఆర్ఎస్కు పోలీసుల వ్యవహారం: కిషన్ రెడ్డి
పలివెల గ్రామంలో టీఆర్ఎస్ కు ఓట్లు రావని తెలిసి దాడికి దిగారన్నారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ కాలుకాలిన పిల్లిలా తయారైందని ఎద్దేవా చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడరని అన్నారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతల కార్లను తనిఖీ చేయడం లేదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే దాడులన్న ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో గెలవరనే టీఆర్ఎస్ తమపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. మునుగోడు ప్రజల తీర్పుతో చెంప ఛెళ్లుమంటుందన్నారు. టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్కు బేస్ లేదని విమర్శించారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర దాడులు కొత్తేమీ కాదన్నారు. కేసీఆర్ గూండాయిజానికి మేం భయపడం. పక్కా ప్లాన్ తో మాపై దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిలో దాదాపు 15 ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి అని ఈటల రాజేందర్ తెలిపారు. కాగా, టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఈటల రాజేందర్ పరామర్శించారు. వారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications