అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు:హోంగార్డుల వేతనాలు పెంచాలన్న కిషన్ రెడ్డి..
ప్రస్తుతం హోంగార్డులకు ఇస్తున్న రూ.12వేల వేతనాన్ని రూ.20వేలకు పెంచాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో తెలంగాణ అసెంబ్లీని ప్రారంభించారు స్పీకర్ మధుసూదనాచారి. టీఎస్-ఐపాస్, రోడ్లు, జాతీయ రహదారుల, ఫిషరీస్ వంటి అంశాలపై ప్రస్తుతం సభలో చర్చ జరుగుతోంది.
టీఎస్ఐపాస్పై గురువారం నాడే సభలో చర్చ జరగాల్సి ఉండగా.. సభ్యుల విజ్ఞప్తి మేరకు జీరో అవర్ అనంతరం సభను వాయిదా వేశారు. దీంతో నిన్న టీఎస్ఐపాస్పై నేడు సభలో చర్చ జరగనుంది.
హోంగార్డులకు వేతనాలు పెంచాలన్న కిషన్ రెడ్డి:
వేతనాలు సరిపోక రాష్ట్రంలో హోంగార్డులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి జీతాలను పెంచాల్సిన అవసరముందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 13ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రస్తుతం వారికి ఇస్తున్న రూ.12వేల వేతనాన్ని రూ.20వేలకు పెంచాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు పరిహారం కూడా పెంచాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
గౌడ కులస్తులే కల్లు దుకాణాలు నడపాలి: పద్మారావు గౌడ్
రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పద్మారావు తెలిపారు. కల్లుగీసే క్రమంలో ప్రమాదాలను అరికట్టడం కోసం.. కేరళలో వినియోగిస్తున్న చెట్లు ఎక్కే యంత్రాలపై అధ్యయనం చేస్తున్నట్టుగా పద్మారావు పేర్కొన్నారు.
కల్లు దుకాణాలు గౌడ కులస్తులే నడపాలని, వారు కాకుండా వేరే వారు కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్టుగా తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బిందు సేద్యం ద్వారా ఈత, తాటి వనాలను పెంచుతామన్నారు.
ప్రమాదాల్లో మరణించిన గీత కార్మికులకు రూ. 30 కోట్ల ఎక్స్గ్రేషియా ఇచ్చామని చెప్పారు.గౌడ సొసైటీలపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని పద్మారావు తెలియజేశారు.