కిషన్ రెడ్డి లక్ : హెంగార్డుల కోసం పోరాడారు.. హోం మంత్రి అయ్యారు
హైదరాబాద్ : ఆయనది హోంగార్డుల కోసం పోరాడిన నేపథ్యం. వెట్టి చాకిరీ చేస్తూ.. సరైన వేతనాలు పొందక నానా ఇబ్బందులు పడుతున్న హోంగార్డులకు ఆయన దిక్సూచి. హోంగార్డులకు సమస్య వస్తే తన సమస్యలా ఫీలయిన నాయకుడు. అంతలా హోంగార్డులతో మమేకమైపోయిన ఆ నేతకు అరుదైన అవకాశం దక్కింది.
హోంగార్డుల సమస్యలపై గళమెత్తడమే కాకుండా నిరాహార దీక్ష కూడా చేసిన ఆ నేత ఎవరో కాదు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర మంత్రి వరకు ఎదిగిన యువనేత కిషన్ రెడ్డి. హోంగార్డుల హక్కుల కోసం పరితపిస్తున్న కిషన్ రెడ్డికి అనూహ్యంగా హోం శాఖ సహాయమంత్రి పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కిషన్ రెడ్డికి హోం శాఖ.. చెన్నమనేని లాగే..!
కేంద్ర కేబినెట్లో తెలంగాణకు చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి సెంట్రల్లో బెర్త్ దొరికింది. గురువారం నాడు ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపుల్లో భాగంగా ఆయనను హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించింది. గతంలో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి కూడా అదే శాఖ కేటాయించడం చర్చానీయాంశమైంది.
అప్పట్లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యం కల్పించడంలో భాగంగానే విద్యాసాగర్ రావుకు ఆ శాఖ కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డికి అదే శాఖ కేటాయించడం వెనుక కూడా తెలంగాణకు పెద్దపీట వేయాలనే తాపత్రాయం కనిపించిందని అంటున్నారు విశ్లేషకులు.

హోంగార్డుల కోసం కిషన్ రెడ్డి నిరాహార దీక్ష
హోంగార్డుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఆయన హోంగార్డ్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పోలీసులతో సమానంగా హోంగార్డులకు వేతనాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. గతంలో ఒకసారి తమ సమస్యలపై గళమెత్తుతూ హోంగార్డులు చేపట్టిన ఆందోళనకు కిషన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర హోంగార్డులు వారి కుటుంబ సభ్యులతో పాటు కిషన్ రెడ్డి కూడా నిరాహార దీక్ష చేశారు.
హోంగార్డులతో వెట్టి చాకిరీ చేయిస్తూ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటారు కిషన్ రెడ్డి. శాసనసభ్యుడి హోదాలో కూడా పలుమార్లు హోంగార్డుల సమస్యలను పోలీస్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి డీజీపీ అనురాగ్ శర్మకు వినతి పత్రం సమర్పించారు. హోంగార్డుల సమస్యలపై గతంలో ఐపీఎస్ అధికారి కౌముది నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సులు అమలు చేయాలని అందులో పేర్కొన్నారు.

హోంగార్డులకు కనీస వేతనం.. పోలీసుల్లాగే జీతాలు..!
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కనీస వేతన చట్టం హోంగార్డులకు కూడా అమలు చేయాలంటారు కిషన్ రెడ్డి. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హోంగార్డులకు కానిస్టేబుల్ గా పదోన్నతి ఇవ్వాలని పేర్కొన్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే హోంగార్డులకు కూడా రెండేళ్లకోసారి కరువు భత్యం పెంచాలని, మహిళా హోంగార్డులకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని, పదవీ విరమణ చేసిన వారికి 5 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని, పోలీస్ శాఖలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
హోంగార్డుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కిషన్ రెడ్డి కీ రోల్ పోషించారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా పరిస్థితి వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు..హోంగార్డులుగా మూడేళ్ల సర్వీస్ ఉన్నవారిని కానిస్టేబుళ్లు, సెక్యూరిటీ గార్డులు, ఫైర్ మెన్లు, ఫారెస్ట్ గార్డులు తదితర పోస్టుల్లో నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

కిషన్ రెడ్డి వైపు హోంగార్డుల చూపు.. న్యాయం చేస్తారని ఆశగా..!
హోంగార్డుల సమస్యలపై పోరాడుతున్న కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. అటు హోంగార్డులు కూడా తమకు కిషన్ రెడ్డి న్యాయం చేస్తారనే ధీమాతో ఉన్నారు. తమ సమస్యలు అన్నీ తెలిసినవారిగా.. తమ కోసం కిషన్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలబడతారని ఆశిస్తున్నారు. ఇన్నాళ్లు హోంగార్డుల సమస్యలపై గళమెత్తిన కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కడంతో కచ్చితంగా అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి మోడీ నేతృత్వంలో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళతానని చెప్పారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినవారికి పెద్దపీట దక్కిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి శాయశక్తులా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లేలా తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications