పొంగులేటి ఇంటిపై కూడా: రేవంత్ ఇంట ఐటీ దాడులపై కిషన్, కేసీఆర్ ఫ్యామిలీపై స్మృతి ఇరానీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేస్తే బీజేపీకి వచ్చే లాభము లేదా నష్టమూ ఏదీ లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి గురువారం అన్నారు. అసలు ఆయన ఇంటిపై దాడి చేయించే అవసరం కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు.
ఈ మధ్య ఖమ్మం జిల్లాలో తెరాస నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయని చెప్పారు. అది కూడా బీజేపీయే చేయించిందా అని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ రండి.. ప్రచారంలో ఉన్నా: ఐటీ అధికారులకు రేవంత్, ముఖంలో లేని టెన్షన్
రాజకీయాల గురించి మాట్లాడుతూ.. వామపక్షాల అవసరం ఈ దేశానికి లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. కోదండరాంను తాము కలిసింది వాస్తవమేనని, కలిసి ముందుకు సాగే అంశంపై చర్చలు జరుగుతున్నాయి చెప్పారు.
కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తు
కుటుంబం కోసమే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తుకు వెళ్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మెదక్ జిల్లాలోని చేగుంటలో బీజేపీ మహిళా శంఖారావ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వీరుల గడ్డ అన్నారు. ఆరు నెలల ప్రసూతి సెలవులను కేంద్రం పెంచిందన్నారు.
అయిదు కోట్ల మంది పేద మహిళలకు ఉజ్వల పథకం కంద ఉచిత సిలిండర్ ఇచ్చామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద 1300 రోగాలకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో తెలంగాణ పాల్గొనడం లేదని విమర్శించారు.
హెల్మెట్ పెట్టుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందని ఆరోపించారు. 80 లక్షల మంది బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పారు. కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారన్నారు.