30కే 3 పెగ్గులు!: కెసిఆర్కు కిషన్ నిలదీత, ఉద్యోగాల్లేవ్, మనిషికైతే ఒక్కసారి: కడియం
కరీంనగర్: తెలంగాణలో చీప్ లిక్కర్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం పునరాలోచన చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జిల్లాలో అన్నారు.
కెసిఆర్ పాలనలో మంత్రులు నామమాత్రంగా మారిపోయారని మండిపడ్డారు. ఒకే వ్యక్తి కేంద్రంగా పాలన సాగుతోందన్నారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. చీప్ లిక్కర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఆర్థిక, కుటుంబ వ్యవస్థలను చీప్ లిక్కర్ నిర్వీర్యం చేస్తుందన్నారు.
చీప్ లిక్కర్ వల్ల గ్రామాలు చీకటిబారిన పడతాయన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో మహిళల ఆమోదం పొందిన తర్వాత చీప్ లిక్కర్ను ప్రవేశ పెట్టాలన్నారు. గ్రామజ్యోతి అనే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని, కానీ చీప్ లిక్కర్ పేరుతో మరోవైపు గ్రామాలను బార్లు చేస్తారా అని మండిపడ్డారు.

కాగా, తెలంగాణలో విక్రయించనున్న చీప్ లిక్కర్ ధరలా దాదాపు ఖరారయినట్లుగా తెలుస్తోంది. 90ఎంఎల్ ధర రూ.15కు, 180 ఎంఎల్ ధర రూ.30కి తగ్గించాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు సచివాలయంలో తన ఛాంబరులో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
కెసిఆర్ది అరాచక పాలన: కూనంనేని
ఎంతోమంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దిక్కుమాలిన కెసిఆర్ చేతిలో పడిందని సిపిఐ నేత కూనంనేని సాంబశివ రావు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నార్నారు. అహంభావంతో కెసిఆర్ అరాచక పాలన కొనసాగుతోందన్నారు.
కెటిఆర్ కోసమే ప్రాజెక్టులు పక్కన పెట్టారు: మల్లుభట్టి
సిఎం కెసిఆర్ తన కొడుకు కెటిఆర్కు వాటర్ గ్రిడ్ పథకం కట్టబెట్టేందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టారని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క బుధవారం మండిపడ్డారు. ప్రాణహిత ప్రాజెక్టుకు వెచ్చించాల్సిన నిధులను వాటర్ గ్రిడ్ పథకానికి మళ్లించారన్నారు. వ్యక్తిగత ఆలోచనలతో కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. కెసిఆర్వి అప్రజాస్వామిక విధానాలన్నారు.
కెసిఆర్ విఫలమయ్యారు: టిడిపి
ఓ పక్క కర్నాటక, మహారాష్ట్రలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన విమర్శలు చేస్తూ కాలం గడుపుతోందని టిడిపి నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా ఆరోపించారు. ఏపీ పైన విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు.
మహారాష్ట్ర, కర్నాటకల అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడంలో విఫలమయ్యారన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ పైన ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టుల పైన లేదన్నరు.
ఆనాడు అల్మట్టి ఎత్తు పెంచకుండా నిలువరించింది... బాబ్లీ ప్రాజెక్టును ఆపేందుకు పోరాడింది చంద్రబాబే అన్నారు. అల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు కృష్ణా నీరు రాదని, ఇంత జరుగుతున్న కెసిఆర్ మౌత్రం మౌనం వీడటం లేదన్నారు.
ఈ ఏడాది డిఎస్సీ ఉద్యోగాల్లేవ్: కడియం
తెలంగాణలో ఈ ఏడాది డిఎస్సీ ఉద్యోగాలు లేనట్లేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 182 మోడల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, వీటి ద్వారా 10,200 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు.
తన కులం, పుట్టుక పైన టిడిపి నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వారి దగ్గర ఆధారాలుంటే చూపించాలని కడియం సవాల్ చేశారు. టిడిపి నేతల ఆరోపణలు నిజమైతే తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తన పైన విమర్శలు సరికాదని, మనిషికైతే ఒకసారి చెబుతామన్నారు. ఎర్రబెల్లి దయాకర రావు తీరు సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలు మాదిగ ఉప కులాలకు చెందిన వారే అన్నారు.












Click it and Unblock the Notifications