మమతది మంచి పనే, కేంద్రాన్ని అడుగుతాం: సుబాష్ బోస్ ఫైళ్లపై కిషన్ రెడ్డి
హైదరాబాద్: భారత స్వాతంత్ర్య సమర యోధుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన రహస్యాలను మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
నేతాజీ మరణానికి సంబంధించిన కేంద్రం వద్దనున్న అధారాలను కూడా బహిర్గతం చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. నేతాజీ మరణంపై ప్రజల్లో అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అబిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. సమస్యలపై చర్చ జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బయటపెట్టడాన్ని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కూడా స్వాగతించారు. నేతాజీ జీవిత విశేషాలు, మరణంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న నేతాజీ పైళ్లను కూడా బయటపెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. అంతకంటే ముందుగా ఫైళ్లలో ఏముందో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.