అవాస్తవాలు ప్రచారం చేయొద్దు: కేసీఆర్కు కిషన్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్పీఆర్లో బర్త్ సర్టిఫికేట్ ఎవరూ అడగరని, వివరాలు చెబితే సరిపోతుందని అన్నారు.
సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలా?
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేంద్రమంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ఇలాంటి వివరాలే అడిగారని.. అప్పుడు కేసీఆర్ వ్యక్తిగత వివరాల గురించి ఎందుకు మాట్లాడలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
సమగ్ర సర్వేలానే.. కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేయొద్దు..
కేంద్రం చేసే ఎన్పీఆర్ సర్వేలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని.. సమగ్ర సర్వేలో ఏ వివరాలు అడిగారో.. తాము కూడా అలాగే అడుగుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. జనాభా లెక్కల్లో భాగంగానే ఈ సర్వే నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డిచెప్పారు. కేసీఆర్ దీనిపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టమో కేసీఆర్ వివరించాలని సవాల్ విసిరారు. సీఏఏ దేశ ప్రతిష్టతకు ఎలా భంగం కలిగిస్తోందని ప్రశ్నించారు. మహిళల ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పొంపొందించిందని కిషన్ అన్నారు. 10 కోట్ల వంట గ్యాస్ ఇచ్చినట్లు తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ, నేవీలలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలోనూ మహిళలకు సరైన ప్రాధాన్యం దక్కిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొదటి ఐదేళ్లపాటు ఒక్క మహిళను కూడా మంత్రిని చేయలేదని విమర్శించారు.
Recommended Video
బర్త్ సర్టిఫికేట్ లేదంటూ కేసీఆర్..
కేంద్రం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన కింద లక్షలాది మంది మహిళలకు కేంద్రం చేయూత నిస్తోందని అన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్పీఆర్లపై స్పందించారు. సీఏఏ, ఎన్పీఆర్లపై ప్రజల్లో ఆందోళన ఉందని, ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశమని అన్నారు. తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని.. ఇక తన తండ్రిది ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అవసరమైతే నేషనల్ ఐడెంటిటీ కార్డు పెట్టండని కేంద్రానికి సూచించారు. అంతేగాక, సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.