రచ్చకెక్కిన కోదాడ బీఆర్ఎస్ నేతల వర్గపోరు... ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మల్లారెడ్డి పై మేడ్చల్ ఎమ్మెల్యే ల తిరుగుబాటు తరువాత, జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచరులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కోదాడలోని ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్ రచ్చ రోడ్డెక్కింది. ఇప్పటికే అనేక మార్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష మధ్య అనేక సందర్భాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాజాగా మరోమారు వీరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.

కోదాడ మున్సిపల్ చైర్మన్ ను అడుగడుగునా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మంగళవారం కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే క్రమంలో మొదటగా కమిషనర్ కార్యక్రమానికి ఉదయం 10:15 గం లకు రమ్మని చెప్పి, తీరా కార్యక్రమం దగ్గరికి వెళ్లేసరికి కమిషనర్ రాకపోగా ఇతర ఇంజినీరింగ్ అధికారులను కూడా రానివ్వకుండా చేశారని తనను అడుగడుగున అవమానిస్తున్నారని లబో దిబో మన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా తాను ఉన్నప్పటికీ తన పని తాను చేసుకోనివ్వకుండా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అడ్డుపడుతున్నారని ఆయన ను టార్గెట్ చేశారు.

ఎమ్మెల్యే వల్ల అధికారులు తనను పట్టించుకోవటం లేదని ఆవేదన
ఎమ్మెల్యే మాటలు వింటూ మహిళా చైర్ పర్సన్ అయినటువంటి తన పట్ల మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను ఫోన్లో ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కమిషనర్ మాట్లాడుతూ మేడం మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ తన పట్ల గౌరవం లేకుండా, బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ప్రోగ్రాం షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే చెప్తే సడన్ గా షెడ్యూల్ మారుస్తున్నారని, కావాలని ఎమ్మెల్యే ఈ తరహా చర్యలకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే చెప్పినట్టే చేస్తానని, మీ కార్యక్రమాలకు రానని కమీషనర్ చెప్పడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు.

ఎమ్మెల్యే తీరుపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తాం
ఒక మహిళా ప్రజా ప్రతినిధి అయిన తన పట్ల అధికారులు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. కార్యాలయంలో తన ఛాంబర్ లోకి రావాలంటే కౌన్సిలర్ లకు, అధికారులకు భయపడే పరిస్థితిని కల్పించారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కోదాడ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని శిరీష తెలిపారు. ఇక ఎమ్మెల్యే చేస్తున్న ఈ రాజకీయంపై సీఎం కేసీఆర్ గారి దృష్టికి, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష తెలిపారు.

గతంలోనూ అనేకమార్లు కంటతడి పెట్టిన శిరీష .. కేసీఆర్ సమస్య పరిష్కరిస్తారా?
గతంలోనూ అనేకమార్లు మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష తనను పార్టీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యే, ఆయన కారణంగా అధికారులు అవమానిస్తున్న పరిస్థితిపై కంటతడి పెట్టారు. ఇక వీరి మధ్య చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన అవుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య పొసగడం లేదన్నది బాహాటంగానే చర్చనీయాంశంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డి అన్నట్టు కోదాడలో వివాదం కొనసాగుతోంది. మరి కోదాడలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపైన అయినా బీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి సారిస్తుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కూడా నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కదిద్దకుంటే కేసీఆర్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టం జరగటం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications