చంద్రబాబు ఇష్యూ: కేసీఆర్కు కోదండరాం దిమ్మతిరిగే కౌంటర్, కూటమి సీట్లపై చాడ వార్నింగ్
హైదరాబాద్: ఇటీవల తాను ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని ఆయన తనను కోరారని, కానీ అనేక సమస్యలు వస్తాయని ఆ ప్రతిపాదనను తిరస్కరించానని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆంధ్రా ఓటర్లకు ఓటు వేసినట్లే అన్నారు.
చంద్రబాబు గురించి నేను చెప్పను, ఆయన చెప్పిందే: కేటీఆర్ దిమ్మతిరిగే షాక్
తాము చంద్రబాబు నాయుడుకో, మరొకరికో అమ్ముడు పోలేదని చెప్పారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు మేం కలిస్తే వచ్చిందా అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సీట్ల ఆలస్యంపై కూడా కోదండరాం అసహనం వ్యక్తం చేశారు.
కోదండరాం అసంతృప్తి, సీపీఐ హెచ్చరిక
రోజు రోజుకు సీట్ల సర్దుబాటు ఆలస్యమవుతోందని కోదండరాం అన్నారు. త్వరగా తేల్చకుంటే ప్రజల నమ్మకం కోల్పోతామన్నారు. తాను పోటీ చేయాలా వద్దా అనేది సీట్ల సర్దుబాటు తర్వాత తేలుతుందని చెప్పారు. కాగా, సీట్ల సర్దుబాటు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. సీబీఐ, టీజేఎస్ తమకు కేటాయించిన సీట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలకు పోతోందని సీపీఐ, టీజేఎస్ విమర్శిస్తున్నాయి. ఆలస్యమైతే ప్రజా సంఘాల్లో ఆగ్రహం వస్తుందని కోదండరాం చెప్పగా, రెండు మూడు రోజుల్లో తేల్చకుంటే తామే అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఐ హెచ్చరించింది.
40 స్థానాల్లో మా ప్రభావం
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పంపకాలపై ఆలస్యమవుతోందని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి వేరుగా అన్నారు. కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు త్వరగా తేల్చాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. 40 సీట్లలో ప్రభావం చూపే శక్తి తమకు ఉందని చెప్పారు. కూటమిలో సర్దుబాటు ఆలస్యమవుతున్న నేపథ్యంలో తాము ప్లాన్ ఏ, ప్లాన్ బీ సిద్ధం చేసుకున్నామన్నారు. తాము ప్లాన్ ఏ ప్రకారం సీట్లు ప్రకటిస్తున్నామని చెప్పారు.
9 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాం
కూటమి ముందు తమకు 9 స్థానాలు పెట్టామని చాడ చెప్పారు. కొన్ని తక్కువగా ఉన్నా సర్దుకు పోవాలని భావించామని చెప్పారు. కానీ సీట్ల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదని చెప్పారు. పొత్తులో భాగంగా తాము అడిగిన స్థానాలు కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, దేవరకొండ, పినపాక, ఆలేరు, మునుగోడు, బెల్లంపల్లి తదితర స్థానాలు అడిగామని చెప్పారు.
ఈ స్థానాల్లో మేం సిద్ధం
కూటమి బలోపేతం కావాలంటే సీట్లు సర్దుబాట్లు తేలాలని చాడ అన్నారు. కొత్తగూడెం, పినపాక, దేవరకొండ, వైరా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. కూటమిలో సీట్లు సర్దుబాటు అయితే ప్లాన్ ఏ (కూటమితో కలిసి ఉండటం) ఉంటుందని, సీట్ల సర్దుబాటు లేకుంటే ప్లాన్ బీ అమలు చేస్తామన్నారు.
ప్లాన్ బీ ప్రకారం ముందుకు
సీట్ల లెక్క తేలకుంటే ప్లాన్ బీ ప్రకారం తాము 20 సీట్లలో పోటీ చేస్తామని చాడ తెలిపారు.పైన సీట్ల విషయంలో సీపీఐ చాలా ఓర్పుగా ఉందని చెప్పారు. కూటమిని ఏర్పాటు చేసేందుకు తొలి నుంచి ప్రయత్నాలు చేసింది తామేనని చెప్పారు. మళ్లీ ఎవరి వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తాము కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, సిద్దిపేట, దేవరకొండ, పినపాక, ఆలేరు, మునుగోడు, బెల్లంపల్లి తదితర చోట్ల పోటీ చేస్తామన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సురవరం సుదాకర్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఎవరూ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా హర్షిస్తామని చెప్పారు.