అదేమిటి అలా అంటారు: వెంకయ్యపై కోదండరామ్ ఫైర్
హైదరాబాద్: హైకోర్టు విభజనపై ఏం చేస్తారో చేసుకోండని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అనడం సరికాదని తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
జేఏసీ ఆధ్వర్యంలో గన్పార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ దీక్ష కార్యక్రమంలో కోదండరాం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా కొన్ని సంస్థలు ఏర్పడలేదని ఆయన అన్నారు. అన్ని సంస్థలు సంపూర్ణంగా ఏర్పడితేనే పూర్తిస్థాయి పాలన కొనసాగిద్దని ఆయన అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గన్పార్కు వద్ద జేఏసీ నేత కోదండరాం నివాళులు అర్పించారు. అనంతరం గన్పార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని మంత్రి జగదీష్రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ప్రొ జయశంకర్ జీవితాంతం పోరాటం చేశారని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు.జయశంకర్ సార్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన అన్నారు.