టీఆర్ఎస్కు కోదండరాం వార్నింగ్ : రైతులకు అన్యాయం చేస్తే.. ప్రభుత్వానికి మనుగడ ఉండదు
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీని మళ్లీ యాక్టివ్ చేసి.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంపై తొలిసారి ప్రత్యక్ష పోరుకు దిగారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపిస్తూ.. నేటి ఉదయం 10 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని ఇందిరా పార్కు వద్ద 'రైతు దీక్ష' పేరిట నిరసనకు దిగారు కోదండరాం.
దీక్ష నేపథ్యంలో.. దీక్షాస్థలి చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించింది ప్రభుత్వం. కాగా, కార్యక్రమంలో కోదండరాంతో పాటు పలువురు ప్రముఖులు, పలు రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. దీక్షలో భాగంగా ప్రసంగించిన కోదండరాం కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అన్యాయం చేసే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన.
చెక్కులు బౌన్స్ అవలేదు, తాత్కాలికంగా నిలిపేశాం : ఎర్రోళ్ల శ్రీనివాస్
నష్ట పరిహారం కింద మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్.. కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని తెలిపారు.
కాగా, ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఓవైపు పలు పథకాలకు నిధుల నిలుపుదల చేయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశిస్తుంటే.. మరోవైపు చెక్కులు బౌన్స్ అయ్యే పరిస్థితి నెలకొనడమేంటని వారు నిలదీస్తున్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా పదేపదే చెప్పే కేసీఆర్.. చెక్కు బౌన్స్ లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.