కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విస్ట్-పార్టీ మారే ఆలోచన లేదంటూనే-అసంతృప్తి వెంటాడుతోందా?
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక సీనియర్లంతా గుర్రుగా ఉన్నారన్న వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ... సీనియర్ల మదిలో లోలోపల అసంతృప్తి బుసలు కొడుతోందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి కూడా ఇవే విమర్శలు చేశారు. మున్ముందు చాలామంది సీనియర్లు పార్టీని వీడుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.

'ఇప్పట్లో' పార్టీ మారే ఆలోచన లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్
ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన తనకు లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మున్ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు,కార్యకర్తల అభీష్ఠంపై తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినప్పటికీ... నాయకత్వ లోపం వల్లే పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవడం వల్ల పార్టీ బలహీనపడిందన్నారు. బీజేపీ బలపడిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని అన్నారు. అంతేకాదు,తెలంగాణలో కాంగ్రెస్కు భవిష్యత్ లేదని చేసిన వ్యాఖ్యలు కూడా వాస్తవమేనని అన్నారు. ఇక పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకంపై పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడదలుచుకోలేదని తెలిపారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో అంతరార్థం అదేనా?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'ఇప్పట్లో' పార్టీ మారే ఆలోచన లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పడం... భవిష్యత్తులో అందులోనే కొనసాగుతానన్న గ్యారెంటీ లేదని పరోక్షంగా చెప్పినట్లుగా కనిపిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నిర్ణయాలు,కార్యకర్తల అభీష్ఠం మేరకు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ఉంటుందని అన్నారు. పైగా బీజేపీ బలం పుంజుకుంటోందని.. కాంగ్రెస్కు భవిష్యత్ లేదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లుగా మాట్లాడారు. దీన్నిబట్టి రాజగోపాల్ రెడ్డి మదిలో పార్టీ మారే ఆలోచన ఉందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

అసంతృప్తి వెంటాడుతోందా?
నిజానికి టీపీసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. సంపన్నుడు,దూకుడు స్వభావం కలిగిన నేత కావడంతో ఆ అంశాలు ఆయనకు కలిసి రావొచ్చునని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును పక్కనపెట్టింది. పోనీ ఆయన సోదరుడికైనా పీసీసీ చీఫ్ దక్కుతుందనుకుంటే అదీ జరగలేదు. ఇప్పటికైతే రేవంత్పై గానీ,పార్టీ నిర్ణయంపై గానీ రాజగోపాల్ రెడ్డి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అదే సమయంలో రేవంత్తో దూరం పాటిస్తున్నారు. అయితే ఈ అసంతృప్తితో పార్టీలో ఆయన ఎన్నాళ్లు కొనసాగగలరన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన... భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications