'కేసీఆర్ ఐరన్ లెగ్ ను చేర్చుకున్నారు' : గుత్తాకు కోమటిరెడ్డి కౌంటర్
నల్గొండ : టీఆర్ఎస్ లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. మొన్నీమధ్యే ఎంపీ గుత్తా, కోమటిరెడ్డిపై పలు విమర్శలు గుప్పించగా.. ఆ విమర్శలను తిప్పికొడుతూ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.
2009, 2014 లో తాను నల్గొండ ఎంపీగా పోటీ చేయకపోయుంటే..! ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి గెలిచేవాడా..? అన్న గుత్తా విమర్శలను కొట్టిపారేస్తూ.. 'నలుగురిని గెలిపించుకోలేని గుత్తాకు తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని' మండిపడ్డారు కోమటిరెడ్డి.
గుత్తా గనుక రాజీనామా చేసి ఉపఎన్నికకు సిద్దమైతే డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేసిన కోమటిరెడ్డి, గుత్తా లాంటి ఐరన్ లెగ్ లను పార్టీలో చేర్చుకుని సీఎం కేసీఆర్ తప్పు చేశారన్నారు. కాంగ్రెస్ ను వీడిన నేతలందరికీ ఆ ఫలితం అనుభవించక తప్పదన్నారు కోమటిరెడ్డి.

విశ్వనగరం కాదు విశాద నగరంగా : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే సంగతి పక్కనబెడితే, విషాద నగరంగా మార్చేస్తున్నారని విమర్శించారు.
నగర సమస్యలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. రహదారుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. గోతులు, గతుకులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇక ట్రాఫిక్ వ్యవస్థ మరింతగా దిగజారిందన్న కిషన్ రెడ్డి, వర్షం వచ్చినా.. గట్టిగా గాలి వీచినా కరెంటు సమస్యలు తప్పడం లేదన్నారు.
రెండేళ్ల కాలంలో టీఆర్ఎస్ అభివ్రుద్ది మాటలకే పరిమితమైందని ఆరోపిస్తూ.. హైదరాబాద్ ను ఇస్తాంబుల్ తరహాలో తీర్చిదిద్దుతామని, అమెరికా సరసన నిలుపుతామని నేతలు చేసిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు అన్నీ మాటలకే పరిమితమయ్యాయని హామిలను ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు కిషన్ రెడ్డి.












Click it and Unblock the Notifications