అమిత్ షాను కలిశాను - రాజీనామాపై తేల్చేసిన కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. బీజేపీలో చేరబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం ఇది. దీని పైన రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావటం నిజమేనని తేల్చి చెప్పారు. అయితే, బీజేపీలో చేరుతున్న అంశం పైన మాత్రం ఆయన ట్విస్ట్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగింది. కానీ, ఆయన పార్టీ మార్పు వ్యవహారం మాత్రం పెండింగ్ లోనే ఉంది.

అమిత్ షా తో భేటీతో మార్పు ఖాయమని
ఇక, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు ఎంపీగా.. ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి ఈ మధ్య కాలంలో ఏఐసీసీ పెద్దలకు దగ్గరయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ నియామకం పైన తొలి రోజుల్లో కొంత వ్యతిరేకించినా.. ఇప్పుడు ఓపెన్ గా ఎటువంటి కామెంట్స్ చేయటం లేదు. పార్టీ స్లార్ క్యాంపెనయినర్ సోదరుడే పార్టీ మారుతుంటే ఎలా అంటూ పార్టీ సీనియర్ నేత వీహెచ్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాను కేసీఆర్ ను ఓడించే పార్టీలోకి వెళ్తానంటూ వ్యాఖ్యలు చేయటంతో..ఇక, ఆయన పార్టీ మార్పు ఖాయమనే వార్తలు బయటకు వచ్చాయి.

అందరి సమక్షంలోనే కలిశా
దీని పైన స్పందించిన రాజగోపాల్ రెడ్డి తాను ఇటీవల కాలంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. తాను షా ను కలవటం కొత్త కాదని..గతంలోనూ అనేక సార్లు కలిశానని చెప్పుకొచ్చారు. అయితే, రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు ఈ ప్రచారం సాగుతోందంటూ వివరించారు. అమిత్ షా తో భేటీ అందరి సమక్షంలోనే జరిగిందని స్పష్టం చేసారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, ప్రజా సమస్యలపై తాను రాజీ లేని పోరాటం చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ తో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం జరగటం గురించి ప్రస్తావించారు.

చర్చించే పార్టీ మార్పుపై నిర్ణయం
రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఊహాగానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గందరగోళానికి గురి చేసే కుట్రకు తెరలేపారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం పైన కార్యకర్తలు..అభిమానులు అయోమయానికి గురి కావద్దని రాజగోపాల్ రెడ్డి సూచించారు. పార్టీ వీడే పరిస్థితులు.. సమయం వస్తే తాను భువనగిరి లోక్సభ, మునుగోడు నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలతో చర్చించి..నిర్ణయం ప్రకటిస్తానని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో..రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారానికి ఆయన వివరణతో ప్రస్తుతానికి ఎండ్ కార్డు పడినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications