రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు.. వైఎస్ స్పూర్తితో కొత్తగా ఇక - కోమటిరెడ్డి సంచలనం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పైన తన అభిమానం ఏంటో స్పష్టం చేసారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పక్క దారి పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మార్పులో తన పాత్ర కీలకంగా ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
కాంగ్రెస్ లో కొంత కాలంగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. YSRCP పార్టీ ఎన్ఆర్ఐ టీమ్ ప్రతినిధులు నిర్వహించిన ప్రత్యక్ష ట్విట్టర్ స్పేస్ లో తన లక్ష్యాలను స్పష్టం చేసారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పక్కదారి పడుతున్నాయని, ఈ తరుణంలో మార్పు దిశగా బలమైన అడుగులు వేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ప్రజలకు మేలు చేసే ఒక బలమైన రాజకీయ వేదికను పునర్నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నానని వెల్లడించారు. అందులో భాగంగానే గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్భయంగా ఖండిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమ పంథానే తనకు ఆదర్శమని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
గత వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా త్వరలోనే ఒక సంచలన నిర్ణయంతో కూడిన ప్రజా రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ లో సంక్షేమ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, విద్యా రంగాని కి ఎంతో కీలకమైన ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేని దయనీయ మైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాజకీయాన్ని కేవలం వ్యాపారంగా మార్చుకుని, పైసలు సంపాదించడమే ధ్యేయంగా వచ్చిన వాళ్లు రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడలేరని చెప్పుకొచ్చారు.
రైతు బంధు లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఒక చేతితో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న ట్లు నటిస్తూనే, మరో చేతితో గల్లీ గల్లీలో ఉన్న బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు పెంచి ఆ డబ్బును ప్రజల నుంచి దారుణంగా గుంజుకుంటోందని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ టీం అంటారని... ఈ రోజు తాము ఈ స్థాయిలో ఉన్నామంటే రాజశేఖర రెడ్డే కారణమని.. తాము ఎప్పటికీ అభిమానంతోనే ఉంటామని.. తమ కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. దీంతో.. అసలు రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.














Click it and Unblock the Notifications