మీరే సీఎంలు, మంత్రులు కండి, రేవంత్ని నేనే ఆహ్వానించా: కోమటిరెడ్డి, అలా చేస్తే టీఆర్ఎస్కే అధికారం’
హైదరాబాద్: తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులకు, పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు పదవులెలా? ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను 100సార్లు చెప్పానని, అయినా వారికి అర్థం కావడం లేదని అన్నారు.
మీరే సీఎం, మంత్రులు కండి..
గట్టిగా వాదన వినిపిస్తే పక్కన పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు. మీరే సీఎం, మంత్రి అవండి.. కానీ, మంచి వ్యక్తులను ప్రోత్సహించండి.. గెలిచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వండని కోమటిరెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు చాలా మందే ఉన్నారని అన్నారు.
మీ కన్ను మీరే పొడుచోవద్దు.. ఆ ధైర్యం ఎవరికీ లేదు
తనకు నోటీసులు ఇచ్చి మీ కన్ను మీరే పొడుచుకోవద్దని కోమటిరెడ్డి హెచ్చరించారు. తనలాంటి కార్యకర్తలు లేకుంటే పార్టీకే నష్టమని అన్నారు. పార్టీ అధిష్టానం తనలాంటి వ్యక్తులను వదులుకోదని అన్నారు. తనను పార్టీ నుంచి పంపించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని అన్నారు.
ఉత్తమ్పై పరోక్ష విమర్శలు
ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ను పార్టీ కోసమే భరిస్తున్నామని ఉత్తమ్ను ఉద్దేశించి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తమను అవమానించినా పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్పారు. మునుగోడు ప్రజలు కోరుకుంటేనే అక్కడ్నుంచి పోటీ చేస్తానన చెప్పానని తెలిపారు. తనకు పదవులు అవసరం లేదని, తనలాంటి వ్యక్తులను పార్టీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మా సోదరుడిది నాది ఒకే అభిప్రాయం కాదు..
తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కోమటిరెడ్డి అన్నారు. తల్లీకొడుకులు, అన్నదమ్ములు వేరే పార్టీల్లో ఉన్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం.. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిది వేరే అభిప్రాయం.. తనది వేరే అభిప్రాయమని అన్నారు. పార్టీలో ఎవరి వాదనైనా వినిపించుకోవచ్చు అని అన్నారు.
రేవంత్ని నేనే ఆహ్వానించా.. అలా చేస్తే మళ్లీ టీఆర్ఎస్దే అధికారం
రేవంత్ రెడ్డిని తానే పార్టీలోకి రావాలని ఆహ్వానించానని, అవసరమైతే అతడ్నే అడగాలని కోమటిరెడ్డి అన్నారు. అలాగని పార్టీలో ఉన్నవారిని పక్కనపెట్టాలని కాదని అన్నారు. పార్టీని బతికించుకునేందుకే ధైర్యంగా మాట్లాడుతున్నానని చెప్పారు. 2014లో చేసిన తప్పులే మళ్లీ చేస్తే టీఆర్ఎస్సే తిరిగి అధికారంలోకి వస్తుందని హెచ్చరించారు. వీహెచ్ అన్నట్లుగా పార్టీలో చాలా మంది టీఆర్ఎస్ కోవర్టులున్నారని కోమటిరెడ్డి చెప్పారు. తనకు కుంతియా మీద వ్యతిరేకత ఏమీ లేదని అన్నారు.