కేసీఆర్.. అర్ధరూపాయికి కూడా కొనని క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు మాకెందుకు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ క్రమంలో మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, కొనుగోలు చేసిన వారే కొనుగోలు గురించి ఆరోపించడం దారుణమన్నారు. అసలు నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఇక ఇదే సమయంలో సెకండ్ హాండ్ ఎమ్మెల్యేలు, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు. వారి నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా వారిని ఎవరు కొనరు. అలాంటి వారిని బిజెపి కొనుగోలు చేయడం అన్నది పచ్చి అబద్దమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ప్రజల శ్రేయస్సు కోసమే రాజీనామా చేశానని పేర్కొన్న ఆయన, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నాడని, ఆయనైనా నేనైనా ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నాం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

యువతను మద్యం మత్తులోకి లాగి జీవితాలను నాశనం చేసింది కేసీఆర్
మునుగోడు నియోజకవర్గంలో తాను యువత చదువుల కోసం సహాయం చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం యువతను మద్యం మత్తులోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కరోన సమయంలో మా ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశానని పేర్కొన్న ఆయన, మధ్యనిషేధం చేసిన గ్రామాలను పార్టీతో సంబంధం లేకుండాసొంత డబ్బులను ప్రోత్సాహకాలుగా ఇచ్చానని తెలిపారు.

సీఎం కేసీఆర్ మూర్ఖుడు
మునుగోడు ఎన్నికల కోసం నా కుమారుడి కంపెనీ పై బురద చల్లే ప్రయత్నం చెయ్యడమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ ని హోల్డ్ చేయించిన, అనేక రకాల కుట్రలు చేసిన మూర్ఖుడు సీఎం కేసీఆర్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో, ప్రజలు తనను ఆదరిస్తున్న అది చూసి ఓర్చుకోలేక, ప్రచారం సమయంలో కావాలని కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు మద్యం తాగించి తనపై దాడులకు ఉసిగొలిపారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు.

సింపతీ కోసం రాజకీయాలు చేసేది టీఆర్ఎస్ పార్టీనే
గత వారం రోజులుగా తాను జ్వరంతో బాధపడుతుంటే సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని సింపతి కోసం అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింపతి కోసం రాజకీయాలు చేసేది టిఆర్ఎస్ పార్టీ నేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. దుర్మార్గపు పాలన పోవాలంటే మునుగోడు ప్రజలు బిజెపిని గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి మనిషి అనేది తెలుసని, కచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో తనను ఆదరిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications