యాగాలపైనే ప్రేమ, రైతులపై కాదు: కేసీఆర్పై మండిపడ్డ కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు యాగాల మీద ఉన్న ప్రేమ రైతులపై లేకుండాపోయిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ప్రభుత్వ పరంగా పలకరించే నాథుడే కరువయ్యాడని ఆయన మండిపడ్డారు. కొంత మంది స్థానికి ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసినంత మాత్రాన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని టీఆర్ఎస్ ఆపలేదన్నారు.
పోటీ జరుగుతున్న ఆరు స్థానాల్లో కనీసం మూడు స్థానాలను గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన స్తంభించిందని చెప్పిన ఆయన టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోందని ధ్వజమెత్తారు.
కాగా, ఈ నెల 23 నుంచి 27 వరకు సీఎం కేసీఆర్ నిర్వహించనున్న ఆయుత చండీ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరవనున్నారు.
సీఎం కేసీఆర్ తాను నిర్వహించనున్న అయుత చండీయాగం ప్రదేశాన్ని ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగాపూర్ నుంచి ఎర్రవెల్లికి రెండు దారులు ఉన్నాయని, కుడివైపు నుంచి వీఐపీలు, ఎడమ వైపు నుంచి సామాన్యులు రావాలని అన్నారు.
యాగం నిర్వఘ్నంగా కొనసాగడానికి అందరూ సహకరించాలని కోరారు. మీడియా కోసం ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. వారికి ప్రత్యేకంగా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.