'అన్నయ్య' తిరిగొచ్చారు..!! అందరూ సిద్ధమేనా?
విదేశాలకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోనంటూ విదేశాలకు వెళ్లిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగొచ్చి నల్గొండలో పర్యటించారు. వాస్తవానికి ఆయన మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత వస్తారనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యపరిచేలా ఎన్నికకు ముందే తిరిగొచ్చారు.
ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది
ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ తరఫున మునుగోడు బరిలో నిలబడ్డ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలంటూ కొద్దిరోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు. ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత, పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉందో గమనించి అప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారిన వెంకటరెడ్డి వ్యాఖ్యలు
ఆయన ఏం మాట్లాడబోతున్నారు? కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడతారా? అనే చర్చ నడుస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. యాత్రలో కోమటిరెడ్డి పాల్గొంటారా? లేదంటే షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేంతవరకు దూరంగా ఉంటారా? అనేది కూడా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆర్థిక బలం, అంగబలం కలిగిన బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కోవడంలో వెనకబడిన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.
ఫలితాలు వచ్చిన తర్వాతే స్పందన
ఉప ఎన్నికలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలంటూ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో ఆయన మాట్లాడిన విషయాలు బయటకు వచ్చాయి. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి తాను ప్రచారం చేసినా గెలవదని, త్వరలోనే తాను పాదయాత్ర చేసి పీసీసీ అధ్యక్షుణ్ని అవుతానంటూ మాట్లాడినవి వైరల్ గా మారాయి. వీటిపై కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీచేసింది. అయితే ఆరోతేదీ ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ఫలితాన్ని బట్టి స్పందించాలనే యోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.