పార్టీ మార్పుపై కొండా దంపతుల క్లారిటీ; వచ్చే ఎన్నికల్లో పోటీ అక్కడనుండే అంటూ సంచలనం
గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొండా దంపతులు పార్టీ మారుతున్నారు అన్న వార్త పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంపై కుమార్తె సుస్మిత పటేల్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొండా దంపతులు క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఎవరూ నమ్మవద్దు అంటూ కొండా దంపతులు పేర్కొన్నారు.
పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కొండా దంపతులు
ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న వార్తలను నమ్మొద్దు అంటూ కొండా దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా కిందనే, కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతామని కొండా దంపతులు తేల్చి చెబుతున్నారు. ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున తమకు ఆదరణ వస్తుందని, అది చూసి ఓర్చుకోలేని అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొండా దంపతులు మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు చేసే నీచ రాజకీయాలను ఎవరు నమ్మొద్దు అంటూ కొండ మురళి వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నుండి వలసలు అంటూ ప్రచారం
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉనికిని కోల్పోతుందని స్పష్టంగా అర్థమైంది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడటం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక బీజేపీ లోనూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని జరిగిన ప్రచారం నేపథ్యంలో కొండా దంపతులు కూడా పార్టీ మారుతున్నారని వార్తలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొండా దంపతులు తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖ పోటీ
గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కొండా సురేఖ చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో తాము వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతామని కొండా దంపతులు స్పష్టం చేస్తున్నారు. వరంగల్ తూర్పు లో కొండా సురేఖ బరిలో ఉంటుందని, మరో సీటు ఇస్తే తాను గానీ, తన కుమార్తె సుస్మిత పటేల్ కానీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామని కొండ మురళి చెబుతున్నారు.
రెండో స్థానంలో తనకు గానీ,కుమార్తెకు గానీ సీటిస్తే పోటీ చేస్తామన్న కొండా మురళి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కష్టంగా ఉన్న ఏ స్థానం నుంచి అయినా తాము ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ గా ఉన్నామని కొండ మురళి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని కొండ మురళి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని కొండ మురళి స్పష్టం చేశారు. పార్టీ మార్పు ఆలోచన తమకు లేదని కొండా మురళి పేర్కొన్నారు.