కొండపోచమ్మ కెనాల్ గండి ఘటన ... ఇది లీకేజీల ప్రభుత్వం అని బండి సంజయ్ ఫైర్
కొండపోచమ్మ కెనాల్ కు గండి పడిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.మొన్న కాళేశ్వరం,అంతకుముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండ పోచమ్మకుగండి పడటంతో రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగాయని,వీటి వల్ల ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.సీఎం కేసీఆర్ స్కీమ్ లను స్కాముల కోసమే పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం కాంట్రాక్టర్ నుండి నిర్మాణానికి అయిన డబ్బులను రికవర్ చేయాలంటూ, మరమ్మతు పనులు చేపట్టాలంటూ పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే నాసిరకం పనులు జరిగాయని, ఇక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణం ప్రాజెక్టు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. నాణ్యత లేని పనులు చేస్తుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయని, నీళ్లు లీక్ అవుతున్నాయని మండిపడిన బండి సంజయ్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని తక్షణం కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.