బాబు గైడెన్స్: కొండా సురేఖ, 2 ఇవ్వలేమని కేటీఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గైడెన్స్తోనే తెలంగాణ టీడీపీ నేతలు సభలో గొడవ చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
గత టీడీపీ పాలనలో రైతుల ఆత్మహత్యల విషయంలో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్రశ్నోత్తరాలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సభలో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. కేంద్రం, పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీడీపీలు అక్కడి సమస్యల పైన ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
అలాగే తెలంగాణ విద్యుత్ సమస్యలను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్లడం లేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకవన్నె పులుల్లాగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. అన్ని విషయాల పైన చర్చించుదామని సీఎం కేసీఆర్ చెప్పినా అడ్డుకోవడమేమిటన్నారు.

తమ బండారం బయటపడుతుందనే తెలంగాణ టీడీపీ నేతలు సభను అడ్డుకుంటోందని జూపల్లి కృష్ణా రావు అన్నారు. తెలంగాణలో నెలకొన్న సమస్యల పైన చర్చించేందుకు పది రోజులు కాదు నెల రోజులు అయినా సిద్ధమని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్య పైన అసెంబ్లీలో చర్చ జరిగితే కారణం ఎవరన్నది తెలుస్తుందన్నారు.
ఒకే ఇంట్లో రెండు ఇవ్వలేం!: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పింఛన్ల పైన స్పందించారు. ఆసరా పథకం రేపటి నుండి తెలంగామ రాష్ట్రంలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేమని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
వికలాంగ పింఛన్లు మాత్రం ఎంతమందికైనా ఇస్తామని చెప్పారు. సర్టిఫికేట్లు లేవని ఎవరు భయపడవద్దని సూచించారు. మూడు నెలల్లో ఆధార్ సర్టిఫికేట్లు ఇవ్వాలన్నారు. ఆధార్ లేకున్నా మూడు నెలలు పింఛన్లు ఇస్తామని చెప్పారు. పించన్లు నేరుగా బ్యాంకులోనే పడతాయన్నారు. ఫ్లోరోసిస్ వికలాంగులకు కూడా పింఛన్లు ఇస్తామని, అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తమదే అన్నారు.












Click it and Unblock the Notifications