జగన్ గూటికి కొండా సురేఖ?.. తెలంగాణలో వైసీపీ కింగ్ మేకర్ కాబోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి ఈ రకంగా వేటుపడటం కొండా సురేఖకు మింగుడుపడని అంశమే. దీంతో ఆమె తదుపరి రాజకీయం ఎటువైపు ఉంటుందనే ఆసక్తికర చర్చ మొదలైంది.
ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని.. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తానని కొండా సురేఖ బహిరంగంగా ప్రకటించినప్పటికీ.. ఆమె ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవకాశాలను కొట్టేపారేయలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే కొండా సురేఖ వైఎస్సార్సీపీలో చేరి తెలంగాణలో ఆ పార్టీకి నాయకత్వం వహిస్తారంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణలో వైఎస్సార్సీపీ విస్తరణకు జగన్ ప్లాన్ చేస్తున్నారని.. రాష్ట్రంలో వైసీపీ పార్టీని నడిపించడానికి బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని ఓ ఊహగానం నడుస్తోంది.
అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొండా సురేఖ మళ్లీ వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2014కు ముందు జగన్ వెనుక నడిచినందుకు కొండా సురేఖ దంపతులు ఎన్నో రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కొండా సురేఖ చూపిన విధేయతకు తగిన గుర్తింపు లభించకపోగా.. వారి రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపు ప్రమాదంలో పడింది. ఆనాటి చేదు అనుభవాల నేపథ్యంలో ఈ దశలో వైసీపీ గూటికి కొండా సురేఖ మళ్లీ వెళ్తారని అనుకోవడం కేవలం ఓ రాజకీయ ఊహాగానం తప్ప మరొకటి కాకపోవచ్చు.













Click it and Unblock the Notifications