కొండా సురేఖ సంచలన ప్రకటన - కాంగ్రెస్ లో కొనసాగుతానని చెప్పిన గంటల్లోనే...!!
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారింది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసారు. సీఎం రేవంత్ లక్ష్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన హైకమాండ్ సీరియస్ అయింది. సురేఖ తో పాటుగా చిన్నారెడ్డి పైనా చర్యలు తీసుకున్నారు. కాగా.. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మంత్రి పదవి బర్తరఫ్ తరువాత చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు చేసిన ప్రకటనతో సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ కీలక ప్రకటన చేసారు. ఢిల్లీ పర్యటన వేళ తన పైన వేటు పడుతుందని గుర్తించిన సురేఖ నేరుగా సీఎం రేవంత్ పైన ఆరోపణలు సంధించారు. కేబినెట్ మంత్రుల పైనా విమర్శలు చేసారు. తనను రాజీనామా చేయమని చెప్పకుండా నేరుగా బర్తరఫ్ చేయటం పైనా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని కీలక ప్రకటన చేసారు. అయితే, ఈ ప్రకటన చేసిన గంటల్లోనే సురేఖ లో మార్పు కనిపిస్తోంది. వరంగల్ కాంగ్రెస్ నేతలు చాలా మంది సురేఖ పైన వేటు వేయటాన్ని స్వాగతిస్తున్నారు. ఇక.. సురేఖ తన తదుపరి అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది. అయితే.. సురేఖ కాంగ్రెస్ లో కొసాగుతానని చెప్పటంతో.. ఇప్పట్లో పార్టీ మార్పు ఉండదని భావించారు.

కొండా సురేఖ అడుగులు ఎటు..!
కాగా.. కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసారు. ఇక.. నిరీక్షణ ముగిసిందని.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్ రాబోతోందని ప్రకటించారు. స్టే ట్యూన్.. తెలంగాణ అంటూ ఆసక్తి కర పోస్టు చేసారు. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. కొండా సురేఖ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల వేళ తన భవిష్యత్ డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్లాన్ - బీ అమలుకు సిద్దమైన తరువాతనే రేవంత్ పైన నేరుగా ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సురేఖ చేసిన పోస్టింగ్ తో పార్టీ మార్పు ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. అటు బీజేపీ నుంచి సురేఖ కు ఆఫర్ సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో సురేఖ తో రెండు రోజులు గా చర్చలు సాగుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాతనే తాము పార్టీ పరంగా స్పందిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు సురేఖ చేసిన ప్రకటన వెనుక ఏంటి నిర్ణయం అనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications