కేసీఆర్ ఫ్యామిలీలో ఇంత జరుగుతుందా? కేటీఆర్, కవితలపై బాంబు పేల్చిన కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ మళ్లీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిత్యం సంచలన వ్యాఖ్యలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న కొండా సురేఖ తనదైన శైలిలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇక కేసీఆర్ ఫ్యామిలీ లో జరుగుతున్న తంతు పై తనకు అనుమానంగా ఉందని మంత్రి కేటీఆర్, కవితల విషయంలో కొండా సురేఖ బాంబు పేల్చారు. అసలు ఇంతకీ కొండా సురేఖ ఏం చెప్పారంటే..
రైతుల విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన కొండా సురేఖ
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర అమరావతి దగ్గర సభ ఏర్పాటు చేసి దేశంలో వ్యవసాయ రంగం పై 40 శాతం మంది జీవనం సాగిస్తూ ఉండటంతో రైతు సమస్యలు ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దీని పై మండిపడ్డ కొండా సురేఖ ఇది హాస్యాస్పదంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, అకాల వర్షాలతో పంట నష్టపోయి బాధపడుతుంటే రాష్ట్రంలో రైతులను ఆదుకోలేని కేసీఆర్, దేశంలో రైతులను ఉద్ధరించడానికి బయలుదేరాడు అంటూ కొండా సురేఖ కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
తల్లికి మట్టి గాజులే తేలేనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా అన్నట్టు కేసీఆర్ తీరు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకుని, తెలంగాణ రైతాంగానికి మాత్రం చేసిందేమీ లేదని కొండా సురేఖ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టోలో రైతులకు ప్రకటించిన హామీలు అన్నింటిని ముందు నెరవేర్చి, తర్వాత దేశంలో తిరుగుతావో .. హిందూ మహా సముద్రంలో దూకుతావో నిర్ణయించుకో కేసీఆర్ అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబ్బులను, పక్క రాష్ట్రాల రైతులకు ఇచ్చిన కెసిఆర్ తీరు తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణలో రైతులను పట్టించుకోలేని కేసీఆర్, ఇప్పుడు దేశంలోని రైతుల కోసం బయలుదేరాడు అంటూ ఎద్దేవా చేసిన కొండా సురేఖ, తల్లికి మట్టిగాజులు కూడా తేలేని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అన్నట్టు కెసిఆర్ తీరు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేటీఆర్, కవితల తీరుపై అనుమానం ఉందన్న కొండా సురేఖ
అంతేకాదు లిక్కర్ స్కామ్లో కూతురు కవిత, గ్రానైట్ దందాలో కొడుకు కేటీఆర్, భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తుంటే తండ్రి కేసీఆర్ దేశాన్ని ఏలడానికి ఇతర రాష్ట్రాల్లో మీటింగులు పెడతాడట అంటూ కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి అభద్రతా భావం లో ఉన్న కవిత తండ్రి వెంట పడి తిరుగుతుందని, కవిత, కేటీఆర్ ల తీరు చూస్తే తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేటీఆర్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్లకపోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి అన్న కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కవితను కేసీఆర్ సీఎం చేస్తారా? కేటీఆర్ అందుకే అక్కడకు వెళ్ళలేదా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను కాపాడటం కోసం సీఎం కేసీఆర్, కవితను తెలంగాణ సీఎం చేస్తారా? అనే అనుమానం తనకు వస్తుందని బాంబు పేల్చారు. అందుకే కేటీఆర్ టిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాలేదు కావచ్చునని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కవిత, కేటీఆర్ ల మధ్య సఖ్యత లేదు.. కేసీఆర్ కుటుంబం లో ఏదో జరుగుతుంది అన్న రీతిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో ఆసక్తికర చర్చకు కారణం గా మారాయి.