కొండగట్టు ప్రమాదం: బస్సుకు ఫిట్నెస్ లేదు, బ్రేకులు ఫెయిల్, విరిగిన స్టీరింగ్.. కండక్టర్ కంటతడి
కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 62కు చేరింది. కాగా, బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

ఫిట్నెస్ లేదు.. బ్రేకులు ఫెయిల్, విరిగిన స్టీరింగ్
ఆర్టీసీ బస్సు ఫిట్నెస్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ పరమేశ్వర్ తెలిపారు. బస్సుకు ఫిట్నెస్ లేదని చెప్పినా.. అధికారులు పట్టించుకోలేదని చెప్పారు.
బస్సు బయల్దేరిన కొద్ది సేపటి తర్వాత స్పీడ్ బ్రేకర్లు వచ్చాయని, అవి దాటిన తర్వాత బస్సు అదుపుతప్పిందని కండక్టర్ చెప్పారు. ఒక్కసారిగా బస్సు 100కి.మీ వేగంతో కిందికి దూసుకెళ్లిందని తెలిపారు. ప్రమాదానికి ముందే బస్సు స్టీరింగ్ కూడా విరిగిపోయిందని తెలిపారు.

విషాదం తలిచి.. కన్నీటిపర్యంతమైన కండక్టర్
బ్రేకులు వేయాలని ప్రయాణికులు కోరగా.. బ్రేకులు ఫెయిలయ్యాయని డ్రైవర్ చెప్పాడని కండక్టర్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాలని కొందరు, గర్భిణీ మహిళలు, చిన్న పిల్లలు కూడా ప్రమాద సమయంలో బస్సులో ఉన్నారని కండక్టర్ ఉద్వేగానికి గురయ్యాడు. 60మంది చనిపోయారని తెలిసి కన్నీటిపర్యంతమయ్యాడు కండక్టర్ పరమేశ్వర్.

జాగ్రత్త అంటూ గట్టిగా అరిచిన డ్రైవర్
బస్సు లోయలో పడుతోందని అందరూ జాగ్రత్తగా ఉండాలని డ్రైవర్ ప్రమాదానికి ముందు గట్టిగా అరిచాడని ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డ ఓ బాలుడు చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత తమ తల్లిని చూపించమంటే ఎవరూ చూపించలేదని కన్నీటిపర్యంతమయ్యాడు బాలుడు.

62కు చేరిన మృతుల సంఖ్య..
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద మృతుల సంఖ్య 62కి చేరింది. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం మరొకరు మృతి చెందారు. ఈ విషయం తెలసుకున్న అపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్లు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తరపున 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా, గురువారం లోయలోపడిన బస్సును బయటికి తీశారు.












Click it and Unblock the Notifications