సుప్రీం కోర్టులో తెలంగాణకు కేంద్రం షాక్: 4రాష్ట్రాలకు కాదు.. ఏపీతో చాలు!
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది! కృష్ణా నది నీటి పంపిణీ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై మంగళవారం నాడు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.
కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో నీటిని మళ్లీ నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరింది. ఇందుకు కొత్త ట్రైబ్యునల్ అవసరమని చెప్పింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. తెలంగాణ కోరినట్లు కొత్త ట్రైబ్యునల్ అవసరం లేదని సుప్రీం కోర్టుకు విన్నవించింది. కృష్ణా నది నీటి పంపకాన్ని రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పరిమితం చేస్తే చాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నీటి పంపిణీ చేయాలని కోరింది. కాగా, కృష్ణా నది నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఏపీ చెబుతుండగా, నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతోంది. ఇన్నాళ్లు దీని పైన కేంద్రం మిన్నకుండింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరింది. సుప్రీం కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.