బీజేపీ సభ్యులు తమ పరపతి ఉపయోగించాలి: అది నిజమేనని ఒప్పుకున్న కేటీఆర్
భాగ్యనగరం విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, నగర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని మంత్రి కేటీ రామారావు సోమవారం విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరం విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, నగర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని, దీనికి బీజేపీ సభ్యులు కూడా తమ పరపతి వినియోగించి నిధులు తెచ్చేందుకు సహకరించాలని మంత్రి కేటీ రామారావు సోమవారం విజ్ఞప్తి చేశారు.
మంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత పెద్దిరెడ్డి గెలుపు!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. శాసనసభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి సభ్యులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు.
వంద రోజుల ప్రణాళికపై ఎవరూ డిమాండ్ చేయలేదని, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతోనే కార్యాచరణ రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ రహదారులకు సరైన నిధులు ఖర్చు పెట్టలేదన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక భారీస్థాయిలో నిధులు ఖర్చు చేస్తోందన్నారు. హైదరాబాద్లో రోడ్ల విషయంలో కొంత అసౌకర్యం ఉన్న విషయం మాత్రమేనని అంగీకరించారు. డ్రయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అక్రమ నిర్మాణాల వల్ల రహదారులపైకి వర్షపు నీళ్లు వచ్చి రోడ్లు పగుళ్లు వస్తున్నాయన్నారు.
హైదరాబాద్ ఫార్మా సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఫార్మా సిటీతో 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 2018 చివరి నాటికి ఫేజ్-1 పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
2013 చట్టం ప్రకారం భూమిని సేకరిస్తున్నామన్నారు. 8,500 ఎకరాల పైచిలుకు స్థలం అవసరమన్నారు. ఇప్పటికే 5,486 ఎకరాల భూమిని సేకరించామని, భూసేకరణ పారదర్శకంగా జరుగుతుందన్నారు.