మూడేళ్లలో సిరిసిల్లకు రైలు కూత.. ఇంకా కేటీఆర్ ఏమన్నారంటే..!
సిరిసిల్ల : రానున్న మూడేళ్లలో సిరిసిల్లలో రైలుకూత పెట్టిస్తానంటూ హామీ ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే తన ధ్యేయమన్నారు. నేత కార్మికులను యజమానులుగా తీర్చిదిద్దుతామని.. బీడీ కార్మికులకు నైపుణ్యంతో కూడిన శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా సిరిసిల్లకు చేరుకున్న కేటీఆర్ కు పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికారు. బంపర్ మెజార్టీతో తనను గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు కన్నతల్లి జన్మనిస్తే.. సిరిసిల్ల ప్రజలు రాజకీయ జన్మను ప్రసాదించారని చెప్పుకొచ్చిన కేటీఆర్.. వచ్చే ఆరునెలల్లో జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రమంతటా తిరుగుతూనే.. సిరిసిల్లను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. తెలంగాణ లెక్క దేశంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్నది సీఎం కేసీఆర్ తపన అని.. అందుకే జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.