షబ్బీర్ ‘భిక్ష’ వ్యాఖ్యలతో గందరగోళం: కేటీఆర్ ఏకేశారు
శాసనమండలిలో వ్యవసాయరంగంపై చర్చ జరుగుతున్న సమయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్: శాసనమండలిలో వ్యవసాయరంగంపై చర్చ జరుగుతున్న సమయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలపై మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ.. తెలంగాణ మా భిక్ష అని అనడంతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వెంటనే మంత్రి కేటీఆర్ లేచి ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
శాసనసభలో ఓ కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ ఇచ్చి పొరపాటు చేశామంటారు.. మండలిలోనేమో తమ భిక్షేనని మరో నేత అంటారని ధ్వజమెత్తారు. ఎవరు భిక్షమేస్తే తెలంగాణ రాలేదని.. ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ చెప్పారు. పాలకుల మెడలు వంచి ప్రజలే తెలంగాణను సాధించుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ తమ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణాలు, ఎరువులను కూడా అందించలేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచిన టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 450కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని మాకు వారసత్వంగా వదిలిపెట్టిందని అన్నారు.
నీలం, జల్ తుఫానుల వల్ల తెలంగాణ రైతులు నష్టపోతే ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని అన్నారు. రైతులను ఆదుకోవాలని టిఆర్ఎస్ నేతలు అప్పటి సీఎంను కోరుతూ కాళ్లు తొక్కుకుంటూ పోయారే తప్ప, రైతులను ఆదుకునేందుకు ఒక్క పైసా విదిల్చలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రిపూట 2గంటలు కరెంటు ఇస్తే.. తమ ప్రభుత్వం పట్టపగలే 9గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు ఎరువుల కోసం రైతులు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం సిరిసిల్లాలో క్యూలో నిల్చుని ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలు ఉన్నట్లు అప్పుడు ఎరువుల కోసం ఉండేదని అన్నారు.
తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని, అలాంటి తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారే రూ.4వేల కోట్లు ఇచ్చిందన్న ఆయన.. తమ ప్రభుత్వం ప్రతీయేటా రూ.4వేల కోట్లు రైతుల కోసం విడుదల చేస్తోందని చెప్పారు.
ఇంతలోనే మరోసారి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తమ శాఖ కాకున్నా కేటీఆర్ వివరణ ఇస్తున్నారని, ఆయన ఆ హక్కుందని అన్నారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. అయితే, తాను కూడా ఆయనకు మాట్లాడే హక్కుందనే అంటున్నానని షబ్బీర్ వివరణ ఇచ్చారు.
ఆ తర్వాత, రైతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని షబ్బీర్ ఆరోపించారు. 750మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించిన ప్రభుత్వం 345మంది రైతులకే ఎక్స్ గ్రేషియా చెల్లించిందని అన్నారు. మిగితా వారికి కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో తెలంగాణ తెలంగాణ మేం ఇచ్చిన భిక్ష అని షబ్బీర్ అనడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కల్పించుకుని భిక్ష అనే పదం మర్యాద కాదని అన్నారు. దీంతో ఆ పదాన్ని ఉపసంహరించాలని షబ్బీర్ కోరారు. తెలంగాణ కోసం అమరులైన వారిపై స్పష్టత లేదని, 1700మంది ఓసారి, 2వేల మంది ఓసారి అని చెబుతున్నారని అన్నారు.
దీంతో మంత్రి కేటీఆర్ మరోసారి కల్పించుకుని మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదని అన్నారు. 1969లో కూడా వందలాది మందిని కాంగ్రెస్ పొట్టన పెట్టుకుందని అన్నారు. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే అనేక మంది తెలంగాణ కోసం అమరులయ్యారని అన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే.. హంతకులే సంతాపం తెలిపినట్లుందని అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెల్లినట్లుందని ఎద్దేవా చేశారు.
అమరవీరులకు రూ.10లక్షల పరిహారం అందజేశామని కొందరు సభ్యులు పేర్కొనగా.. మీ ఇంట్ల నుంచి తెచ్చిచ్చారా? అంటూ షబ్బీర్ మండిడ్డారు. సిగ్గుండాలి ఇలా మాట్లాడటానికి అంటూ ధ్వజమెత్తారు. రైతులకు రూ.790కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. పత్తి వేసుకోవద్దని ఎందుకు సూచించారని ఆయన ప్రశ్నించారు. సోయాబీన్ పంటలు వేసి రైతులు నష్టపోయారని అన్నారు.
మంత్రి తుమ్మల నియోజకవర్గంలోనే పత్తి పండుతోందని అన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రైతులకు అవసరమైన రుణాలు ఇవ్వడం లేదని అన్నారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల కంపెనీలపై ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు పంటల విషయంలో క్షేత్రస్థాయిలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారులను నియమించామని తెలిపారు. పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీ రుణాలు అందజేస్తున్నామని తెలిపారు.