రూటు మార్చిన కేటీఆర్, హరీష్ రావు!!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమిపాలైన బీఆర్ఎస్ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు ఒకపక్క అధికార పక్షం పై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేస్తూనే, మరొక ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టారు. ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్లి సామాన్యుల మాదిరిగా సామాన్యులలో కలిసిపోతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు.ఇప్పటి మార్పు బాగుందా అంటూ ఆరా తీస్తున్నారు.
దీంతో ఇప్పుడు వీరిద్దరి వ్యవహార శైలి రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోను ఆసక్తికరంగా మారింది. తాజాగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ భవన్లో పారిశుద్ధ కార్మికులతో సమావేశం నిర్వహించిన ఆయన వారితో కాసేపు ముచ్చటించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. వారితోనే కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు.

ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మెట్రో రైలులో ప్రయాణం చేసి సాధారణ ప్రయాణికులతో కలిసి ముచ్చట పెట్టారు. సామాన్య ప్రజలతో సరదాగా మాట్లాడిన హరీష్ రావు ఇటీవల ఎల్బీనగర్ నుండి లక్డీ కా పూల్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు.
అంతే కాదు ఇటీవల సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ లో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి దగ్గర ఆగి ఇడ్లీలు తిని అక్కడ టిఫిన్ చేస్తున్న యువకులతో సరదాగా సంభాషించారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇలా ఇద్దరు బిఆర్ఎస్ నేతలు సామాన్యుల మాదిరిగా పోటాపోటీగా ప్రజల వద్దకు వెళుతుండడం ప్రజల మద్దతును పొందే ప్రయత్నంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి అత్యధిక సీట్లను గెలుచుకునే లక్ష్యంతో ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వారు వెళుతున్నట్టు చెబుతున్నారు. ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వారు నేరుగా ప్రజల వద్దకే వెళ్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications