మాటలు కాదు: కేసీఆర్పై కెటిఆర్ ప్రశంసలు, అదరగొట్టిన వండర్ కిడ్ లక్ష్మీశ్రీజ
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావుపై ఆయన తనయుడు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ప్రశంసల వర్షం కురిపించారు. ఖమ్మంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో బుధవారం ఆయన మాట్లాడుతూ..'కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి' అని అన్నారు.
ప్లీనరీలో మునిసిపల్ పాలనపై తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కేసీఆర్ కేవలం మాటలు చెప్పి విడిచే ముఖ్యమంత్రి కాదని చేతల్లో చూపిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ రాబోతుందని చెప్పారు.
దేశంలోనే వినూత్న పారిశ్రామిక విధానాన్ని తెచ్చామని కేటీఆర్ చెప్పారు. దళిత, గిరిజిన, మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ పారిశ్రామిక విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
టిఆర్ఎస్ హైదరాబాదీయుల మనసును గెలుచుకుందని వ్యాఖ్యానించారు. విశ్వనగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చర్యల చేపట్టామన్నారు. రూ.20వేల కోట్లతో హైదరాబాద్లో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ప్లీనరీ వేదికపై అదరగొట్టిన లక్ష్మీ శ్రీజ
ఖమ్మంలో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తెలంగాణ సూపర్ కిడ్ లక్ష్మీ శ్రీజ గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది. వేదికపై ఉన్న వారందరికీ నమస్కారాలని.. తన పేరు లక్ష్మీ శ్రీజ అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఈ బాల మేధావి, పలు అంశాలపై గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది.
టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు, గతంలో కేసీఆర్ నిర్వహించిన పదవులు, గతంలో చంద్రబాబు రూపొందించిన విజన్ 2020లో తెలంగాణ గురించి లేకపోవడంపై కేసీఆర్ చేసిన బహిరంగ విమర్శలు, చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచినప్పుడు కేసీఆర్ చేసిన విమర్శల గురించి వివరించింది.
అంతేగాక, వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రమాదంలో చనిపోవడం, సీఎంగా రోశయ్య ప్రమాణ స్వీకారం, ఫ్రీజోన్ ఉద్యమం ప్రత్యేక ఉద్యమంగా మారడం, కేసీఆర్ క్యాబినెట్.. ఇలా పలు అంశాల గురించి క్లుప్తంగా ఎటువంటి పొరపాటు లేకుండా.. స్పష్టంగా వేదికపై నుంచి శ్రీజ మాట్లాడింది.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్థానంతో పాటు ఆయన పని చేసిన వివరాలను చక్కగా వివరించారు. సీఎం కేసీఆర్ కేబినెట్ను సంపూర్ణంగా తెలిపారు. మంత్రులు వారి శాఖలను చిన్నారి తెలియపరిచారు. దీంతో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరూ చప్పట్లు కొట్టి చిన్నారిని అభినందించారు.
ఇక లక్ష్మీశ్రీజ మాట్లాడుతున్నంత సేపు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముసిముసి నవ్వులు నవ్వారు. చిన్నారి జ్ఞపకశక్తి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఆశ్చర్యకితులయ్యారు. లక్ష్మీశ్రీజ మాట్లాడే కంటే ముందు సీఎం కేసీఆర్ వేదికకు లక్ష్మీశ్రీజను పరిచయం చేశారు. లక్ష్మీశ్రీజ తెలంగాణ ఉద్యమ చరిత్రను అలవొకగా చెబుతుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన శ్రీజను దీవించడం జరిగిందన్నారు. నిన్న కూడా తన ఇంటికెళ్లి దీవించానని, శ్రీజకు ఐఏఎస్ కావాలనే కోరిక బలంగా ఉందన్నారు.
తెలంగాణపై ఆ చిన్నారికి ఉన్న అవగాహనను చూసి ముచ్చటపడిన సీఎం కెసిఆర్.. ఇటీవల ఆమె చదువుల కోసం రూ. 10లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, మంగళవారం శ్రీజ ఇంటికెళ్లి కలిశారు. తనకు మాటిచ్చిన విధంగా శ్రీజ ఇంటికి వెళ్లి కలిసినట్లు సీఎం కెసిఆర్ తెలిపారు. ఆమెను ఐఏఎస్ కావాలంటూ ప్రోత్సహించారు.