తెలంగాణ వల్ల ఆంధ్రాకు మేలు, విడిపోకుంటే అమరావతి వచ్చేదా: కెటిఆర్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఏపీలోని విజయవాడ సహా పలు నగరాలు అభివృద్ధి చెందేవా? అమరావతి వంటి గొప్ప రాజధాని సాధ్యమయ్యేదా? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు.
కూకట్ పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఏపీలో విజయవాడ సహా పలు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కలిసి ఉంటే అమరావతి రాజధాని అయ్యేదా అన్నారు.
తమ పార్టీలో చేరేందుకు చాలామంది కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారన్నారు. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి ఎందరో స్థిరపడ్డారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రహదారులను అభివృద్ధి చేస్తామని కెటిఆర్ చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు వల్ల ఆంధ్రా ప్రజలకు మేలు జరిగిందన్నారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడున్నా తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింప చేయాలనేదే తమ అభిమతం అని చెప్పారు.
మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేత నర్సింహ యాదవ్, కార్యకర్తలతో సహా టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్నారు.
గత పాలకులు పేదలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తోందన్నారు. విభిన్న దృవాలైన కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ఒక్కటయ్యాయో ప్రజలను చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని సర్కస్లు చేసినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేకే: మహేందర్ రెడ్డి
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో రంగారెడ్డి జిల్లాలో చెరువులకు జలకళతో కలకలలాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశంలోనే జలహారం అందరి ప్రశంసలు అందుకుంటోందన్నారు. రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ కంచుకోట అన్నారు.