కారేపల్లి అగ్నిప్రమాద ఘటనలో కుట్రకోణం?.. కేటీఆర్ వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. మరో నలుగురు తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఖమ్మంజిల్లా కారేపల్లిలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరగవలసిన క్రమంలో అక్కడ బాణాసంచా పేల్చడంతో పక్కనే ఉన్న గుడిసెపై పడి మంటలను, అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన చోటుచేసుకోగా ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనలో గాయపడిన వారిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లతో కలిసి పరామర్శించిన మంత్రి కేటీఆర్ నలుగురి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కారేపల్లి అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, కుట్రకోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్టు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

మంత్రి కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా లేదా ఈ ఘటనలో మరి ఏదైనా కుట్రకోణం ఉందా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అప్పటివరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న కారేపల్లిలో ఉన్న సంతోషం పేలుడు ఘటనతో ఒక్కసారిగా విషాదంగా మారింది. ఎన్నో కుటుంబాలలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.












Click it and Unblock the Notifications