ఆంధ్రాకు నీళ్ళు...తెలంగాణా రైతులకు కన్నీళ్ళా రేవంత్ రెడ్డి?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కొత్త ఆయుధం దొరికింది. గోదావరి, కృష్ణా జలాల పైన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పక్కనపెట్టి నీళ్లను ఆంధ్రకు వదిలిపెట్టడం ద్వారా తెలంగాణలో పంటలను ఎండబెడుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రైతులకు సాగునీరు లేదన్న కేటీఆర్
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రెండు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇచ్చామని కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కరువు తెచ్చింది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని, రైతులకు 24 గంటల విద్యుత్తు అందుబాటులో ఉంచామని, సాగుకు నీళ్లు అందించామని, విత్తనాలు, ఎరువులు సమయానుకూలంగా అందించామని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో అన్నదాతలపై కక్ష సాధింపు
పంట కొనుగోళ్లలోను, గిట్టుబాటు ధర ఇచ్చేలాగా చూసామని, బీఆర్ఎస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా రైతులకు ఎటువంటి భరోసా లేదని పేర్కొన్నారు. రైతు భరోసా రాక సాగునీరు ఇవ్వక, విత్తనాలు ఎరువులు ఇవ్వక, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణా ఆగం
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఆగమవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. విద్యుత్ కోతలతో అన్నదాతలు బోరున ఏడుస్తున్నారని తెలిపారు.సాగు చేసుకోవడానికి సరిపడా నీళ్లు ఇవ్వకుంటే చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని మండిపడ్డారు. ఏం చేయాలో తెలియక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో చెరువులు నిండుగా, ప్రస్తుతం ఎండిపోయి వెలవెల
కేసీఆర్ పాలనలో చెరువులు నిండుగా కనిపించాయని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించామని కేటీఆర్ గుర్తు చేశారు. కెసిఆర్ పాలనలో ఎండాకాలంలో కూడా నిండుగా ఉన్న చెరువులు ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతున్నాయని కేటీఆర్ అన్నారు. రైతన్నలకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రాకు నీళ్ళు...తెలంగాణా రైతులకు కన్నీళ్ళా అంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications