తిరుగులేని భారత్, తెలంగాణ నెంబర్ వన్: శ్రీలంకలో కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్/కొలంబో: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పదిలక్షల మందికి ఉపాధి కల్పించటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర నైపుణ్య మిషన్ ఏర్పాటుచేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. అంతేగాక, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణనిస్తే భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కెటిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్నవారి సంఖ్య తగినంతగా లేదని మంత్రి పేర్కొన్నారు.
వారందరికీ సరైన శిక్షణ ఇవ్వటానికి వీలుగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్-2016కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 'భవిష్యత్తుకు అవసరమైన మానవ వనరులు- భారతదేశ అనుభవం' అనే అంశంపై ఆయన ఆ సదస్సులో మాట్లాడారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉన్నా.. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నట్లు చెప్పారు.
గతంలో తమ ప్రాంతంలో పదేళ్లలో చేజిక్కిన విజయాలను తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లలోనే సాధించామన్నారు. 42శాతం పట్టణ జనాభా ఉన్న తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా, లక్షన్నర ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమల అనుమతికి అతి సరళీకరణ విధానం అనుసరిస్తున్నట్లు చెప్పారు. 14,000 ఎకరాల్లో హైదరాబాద్లో ఔషధనగరి, వరంగల్లో 2000 ఎకరాల్లో జౌళి పార్క్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఐటీలో అగ్రగామిగా ఉందంటూ ప్రపంచ ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్లో సంస్థలను నెలకొల్పాయని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీహబ్ ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వం- విద్యాసంస్థలు- పరిశ్రమల మధ్య అనుసంధానం లక్ష్యంగా ఏర్పాటుచేసిన తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్) సత్ఫలితాలు ఇస్తోందన్నారు.
శ్రీలంకలో కెటిఆర్
శ్రీలంకతో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య సంబంధాలపై గురువారం మంత్రి కేటీఆర్, అక్కడి భారత హైకమిషనర్ వై.కె.సిన్హాతో చర్చించారు. శ్రీలంక కంపెనీలతో ఆరోగ్య సంరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, పర్యాటక రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యానికి సహకరించాలని కోరారు.
శ్రీలంకలో కెటిఆర్
కొలంబో నుంచి హైదరాబాద్కు నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటుపైనా చర్చించారు. ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హైకమిషనర్ హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
శ్రీలంకలో కెటిఆర్
ఆహారశుద్ధి, జౌళి, సరకు రవాణా వ్యాపారంలో పేరొందిన శ్రీలంక సంస్థ జాన్కీల్స్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై ఆయా రంగాల అభివృద్ధికి తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు.
శ్రీలంకలో కెటిఆర్
మలేషియాలోని పేరక్ రాష్ట్ర సీఎం జాంబ్రీ అబ్దుల్ఖదీర్తో భేటీ అయిన కేటీఆర్ గతంలో మలేషియా పర్యటన సందర్భంగా చర్చించిన అంశాలపై మాట్లాడారు. అనంతరం శ్రీలంకలోని ప్రముఖ రెడీమేడ్ దుస్తుల పరిశ్రమల సంస్థ హైద్రమణి ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
శ్రీలంకలో కెటిఆర్
ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పాటుచేయనున్న టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆయన కోరినట్లు.. కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో మంత్రి పర్యటన విశేషాలను ప్రస్తావించింది.