లాస్ట్ వార్నింగ్ : బండి సంజయ్ ను టార్గెట్ చేసిన కేటీఆర్ ..ఎవరి డబ్బుతో ఎవరు కులుతున్నారని ఫైర్
త్వరలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓరుగల్లు మీద రామబాణాన్ని సంధిస్తోంది . ఈరోజు రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటుగా, వరంగల్ వేదికగా ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన కేయూ విద్యార్ధి మృతి
కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం .. వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్
సీఎం కేసీఆర్ వయసును ,హోదాను చూడకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయనను నోటికొచ్చినట్టు దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఇదే చివరి హెచ్చరిక అంటూ వరంగల్ వేదికగా విరుచుకుపడ్డారు.
వరంగల్ లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశాయిపేట లో జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న కేటీఆర్ విపక్షాలపై మండిపాటు
ఎల్బీనగర్ లో షాదీఖానా, దూపగుంట లో 600 ఇళ్లు ,మండి బజార్ లో హజ్ హౌస్, లక్ష్మీపురంలో సమీకృత మార్కెట్లకు శంకుస్థాపన చేశారు కేటీఆర్. ఇక గరీబ్ నగర్ లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, కొందరు నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఏబీవీపీ నాయకులు తన పర్యటన అడ్డుకోవాలని ప్రయత్నం చెయ్యటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
ప్రధాని మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్న కేటీఆర్
నిరుద్యోగి సునీల్ ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. సునీల్ ను రెచ్చగొట్టడం వల్లే అతను చనిపోయాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ కావలసిన వాడినని సునీల్ చెప్పాడని, ఐఏఎస్ ఎవరు భర్తీ చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మండిపడ్డారు. వరంగల్ నగర అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇచ్చాము అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తాము ఇచ్చిన డబ్బు రెట్టింపు డబ్బులు కేంద్రం నుంచి తీసుకు రాగలరా అంటూ కేటీఆర్ సవాల్ చేశారు.
ఉగాదికి ఒకరోజు ముందే నగరంలో మిషన్ భగీరథ త్రాగునీరు అందించాం
ఉగాదికి ఒకరోజు ముందే నగరంలో మిషన్ భగీరథ త్రాగునీరు అందించామని పేర్కొన్న కేటీఆర్ మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని, వరంగల్ కు మెట్రో నియో రైలు తీసుకొచ్చేది తామేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారో చెప్పాలి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ యువకులు క్షణికావేశానికి గురికావద్దని, ప్రతిపక్ష నాయకుల మాటలు విని గందరగోళానికి గురి కావద్దని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో అందరికీ తెలుసన్న కేటీఆర్
గత ఆరున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు సిఎం కెసిఆర్ వల్లనే జరిగాయని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపనల అనంతరం సభలో ప్రసంగించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వద్ద కేంద్ర నిధులతో తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తున్నారన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ఎవరి డబ్బుతో ఎవరు కులుకుతున్నారో అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు .