వసతులకు దూరంగా గిరిజన పల్లెలు: కదిలిస్తే కన్నీటి గాథలు
వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో తెలంగాణలోని గిరిజన ప్రాంతాలను అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా.. ఎందరో పాలకులు మారుతున్నా.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదు.
హైదరాబాద్: వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో తెలంగాణలోని గిరిజన ప్రాంతాలను అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా.. ఎందరో పాలకులు మారుతున్నా.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదు. వర్షాకాలం వస్తే చాలు.. ఇంటెదుట బురద, దోమలు, ఎక్కడ కూడా కనిపించని మురుగునీటి పారుదల వ్యవస్థ. రోడ్డు మార్గం కొన్ని ప్రాంతాలకే పరిమితం.
ఎక్కడకు వెళ్లినా కాలినడకే శరణ్యం. వేషధారణలోనూ ఇంకా మార్పు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారంతా కనీస మౌలిక వసతులకు ఆమడదూరంలో జీవిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లో 29 మండలాల్లో వైరల్ జ్వరాలతో ప్రజలు నాటు వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఉంటుందని తెలిసినా వైద్యఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది. ఆస్పత్రిలో చేరినవారికి కూడా సరైన వైద్య సౌకర్యాలు కల్పించడం లేదని తెలుస్తోంది. భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలో 19 మండలాలు, ఖమ్మం జిల్లాలో 10 మండలాల్లో గిరిజనులు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో వీరి సంఖ్య మరీ ఎక్కువ. పూర్తిస్థాయి ఏజెన్సీగా గుర్తింపు కూడా పొందింది. వీరి బాగోగులు చూడటానికి ఐటీడీఏ ఏర్పాటు చేసినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ దరి చేరడంలేదు. వసతుల్లేక ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజన గూడేల ప్రజలు ప్రత్యేకించి గర్భిణులు పలు ఇబ్బందుల పాలవుతున్నారు.
కిలోమీటర్ల కొద్దీ కాలి నడక ప్రయాణం
భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన పల్లెల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇదే పరిస్థితి. ఇదేక్రమంలో గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గిరిజన తండాల్లో వీరు కాలినడకనే వెళ్లాల్సివస్తోంది. నొప్పులు వస్తే కూడా తెల్లారే వరకు ఉండాల్సి వస్తోందని పలువురు గర్భిణులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం నడుచుకుంటూ వెళ్తామని బిందు అనే గర్భిణి పేర్కొంది. కుటుంబ సభ్యుల సహకారంతో నడుచుకుంటూ వెళ్తామని, వైద్యులు ఎవరూ రారని, మందులు కూడా ఇవ్వరని చెబుతోంది. గుడ్లు, పాలు మాత్రం అందుతున్నాయని చెప్పింది. చర్ల వరకు నడుచుకుంటూ వెళ్లాలంటే ఇబ్బందేనంది. బత్తినపల్లికి చెందిన సుజాత మాట్లాడుతూ.. వర్షాకాలంలో వాగులు దాటడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. నొప్పులు వస్తే ఇబ్బంది పడాల్సిందేనన్నారు. రోడ్డు కూడా లేక ఇబ్బందిగా ఉందని చర్లకు వెళ్లాలంటే గుండ్లవాగు, బత్తినపల్లివాగు దాటాల్సి వస్తోందని వాపోయారు. జ్వరం, దగ్గు, కడుపునొప్పి తదితర అనారోగ్య కారణాలు ఏవైనా 10 కి.మీటర్లు నడవాల్సి వస్తోందని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన పార్వతి అన్నారు. ఆటోలు రావు, దారిలేదు. దరిదాపుల్లో అత్యవసర సేవలు ఉండవు. నాలుగు గంటలు నడిస్తేనే వైద్యసేవలని పేర్కొంది. మూడో నెల పాపకు టీకా వేయించడానికి నడుచుకుంటూ బయలుదేరామని చెప్పారు.
15 కిలోమీటర్లు కాలి నడక ఇలా
చర్ల, దుమ్ముగూడెం, గుండాల తదితర మండలాల్లో పుట్టకొకరు చెట్టుకొకరుగా జీవిస్తున్నారు. చర్ల పరిధిలోని ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, కుర్నేపల్లి తదితర తండాల గిరిజనులు మండల కేంద్రానికి రావాలంటే సుమారు 15 నుంచి 25 కిలో మీటర్లు ఉంటుంది. వీరికి ఎలాంటి రహదారి సౌకర్యం లేదు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు మీదుగా పైనంపల్లి వరకు తారురోడ్డు ఇటీవల సుమారు రూ.7 కోట్లతో వేశారు. పైనంపల్లి శివారు దాటితే వచ్చేది ఛత్తీస్ఘడ్ రాష్ట్రం. పైనంపల్లి నుంచి ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, కుర్నేపల్లి తదితర గ్రామాలకు వెళ్లాలంటే కాలిబాటనే ఆశ్రయించాలి. చుట్టూ కారడివిలో నడవాలి. ఎదురుగా కొంత దూరంలో ఎవరు ఉన్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో కాలిబాట ఉంది. ఇలా పయానం సాగిస్తేనే ఆయా గ్రామాలు వస్తాయి. స్థానికులు అనారోగ్యానికి గురైనా ఇతరత్రా అవసరాలకు రావాలంటే కూడా సుమారు 15 కి.మీటర్లు నడిస్తేనే చెన్నాపురం వస్తుంది. అక్కడ నుంచి తారు రోడ్డు ఉంది. అయినా ద్విచక్ర వాహనం, సైకిల్లాంటి వాహనాలు లేని వారు కాలినడక వెళ్లాల్సిందే.
తల్లిదండ్రులు పిల్లల విద్యాభ్యాసంపై అనాసక్తి
మన్యంలో చాలా పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు మధ్యాహ్నానికే ఇంటిబాట పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరైతే వారానికోసారి, నెలకోసారి వస్తున్నారని, వంతులు వేసుకుంటున్నారని మన్యం వాసులు చెబుతున్నారు. వచ్చినా.. గంట, అరగంట ఉండి వెళ్లిపోతుండడంతో పిల్లలకు అరకొర చదువులే దిక్కవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదో తరతి విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో అ, ఆ, ఇ, ఈలు కూడా రావడంలేదని, కావాలంటే పరీక్షించుకోవచ్చని చెబుతున్నారు. చదువులు ఇలా ఉండడంతో చాలామంది పిల్లలు చదువుకోవడం మానేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ఆసక్తి చూపడంలేదు. తమ ఇద్దరు పిల్లల్లో ఒకరిని బడికి పంపిస్తున్నానని, మరొకరిని పశువులు మేపడానికి పంపిస్తున్నానని ముస్కి జోగా అనే మహిళ చెబుతోంది. కాగా ఇంటింటికి వెళ్లి పిల్లలను బడికి పంపించాలని చెబుతున్నామని, పొలం పనులు, పశువులు మేపడానికి ఎవరూలేరని తల్లిదండ్రులు చెబుతున్నారని గోరుకొండ ప్రభుత్వ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటంలేదన్నారు. బట్టలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నామన్నారు.
పాత పద్ధతుల్లోనే జీవనం ఇలా
మన్యంలో చాలా గ్రామాల్లో నేటికీ సింగిల్ ఫేజ్ కరెంటు సరఫరా అవుతుంది. కొన్ని తండాలు, గ్రామాల్లో ఆ సౌకర్యం కూడా లేదు. ఆర్సీసీతో కూడిన ఇళ్లు వేళ్లమీద లెక్కించవచ్చు. నిజం చెప్పాలంటే పక్కా భవనాలు చాలా తక్కువ. ఇంటి పైకప్పు బెంగళూరు గూనతో కప్పేస్తారు. ఇంటి ప్రహరీ నిర్మాణం కట్టెలతోనే ఉంటుంది. ఆరుబయటే వంటావార్పు పూర్తి చేస్తారు. ప్రతి ఇంటిలోనూ ఇంకా ఇప్పసారా కాస్తున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఇప్పసారా తాగుతామని చెబుతున్నారు.
రోజుకు 2000 కేసుల నమోదు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపానే ఉన్న వికారాబాద్ జిల్లా వాసులకు డయేరియా దడ పుట్టిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇటు రోగులు, అటు వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వారం నుంచి డయేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఆస్పత్రి జనరల్ వార్డులతోపాటు డయేరియా కేసులు కూడా ఎక్కువ కావడంతో రోగులతో ఆస్పత్రి నిండిపోతోంది. తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని యాలాల, పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు, మున్సిపల్ నుంచి రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాండూరు ఆస్పత్రికి రోజు ఓపి పేషెంట్లు 1500 నుంచి 2000 వరకు వస్తున్నారు. అందులో ఎక్కువగా డయేరియా కేసులే ఉంటున్నాయి. 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా ఆస్పత్రిలో 687 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. డయేరియా ప్రబలిన వారిలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. గతేడాది ఇదే సీజన్లో మూడు నెలల్లో తాండూరు ఆస్పత్రిలో సుమారు 900 వరకు డయేరియా కేసులు నమోదయ్యాయి. అయినా వైద్యాధికారులు గుణపాఠం నేర్చుకోక ఈసారి కూడా పరిస్థితిలో మార్పురాలేదు. రోజూ రెండు వేలకు పైగా కేసులు నమోదవుతుంటే హాస్పిటల్ పరిసరాలు అపరిశుభ్రంగా కాక, ఎలా ఉంటుందని సూపరింటెండెంట్ భాగ్యశేఖర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.