మావోయిస్టుల సమాచారమిస్తే లక్షల్లో నగదు బహుమతులు.. మావోలకు చెక్ పెట్టే పోలీసుల నయా ప్లాన్!!
తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లకు పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీకి చెందిన నక్సలైట్లు చత్తీస్ గడ్ , మహారాష్ట్ర ,తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నారన్న సమాచారంతో సరిహద్దు అటవీ ప్రాంతాలు ఉన్న అనేక జిల్లాలలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలలో మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇక ఏకంగా ఎస్పీలే రంగంలోకి దిగి మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.

ఏజెన్సీలోని గిరిజన గూడేలలో ఇల్లిల్లూ తిరుగుతూ మావోలకు సహకరించొద్దన్న పోలీసులు
ఇక మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాలలోని ఆదివాసీ గిరిజనుల సహాయం తీసుకుంటున్నారని, వారి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని పదేపదే చెబుతున్న పోలీసులు, ఆదివాసీ గిరిజనులు వారికి ఎటువంటి సహాయం చేయకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీలోని గిరిజన గూడేలలో ఇల్లిల్లూ తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలించడం కోసం పోలీసులు కొత్త పంథాను ఎంచుకున్నారు.

మావోల సమాచారం చెప్పిన వారికి నగదు బహుమతి
నక్సలైట్ల సమాచారం అందించిన వారికి బహుమతులు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నమావోయిస్టు వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చిన పోలీసులు ప్రజల బంగారు భవితను తీర్చిదిద్దుకోవడానికి పోలీసులతో సహకరించాలని కోరుతున్నారు. వరంగల్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారని అనుమానిస్తున్న మావోయిస్టుల ఫోటోలను ప్రచురించి వారి ఆచూకీ పోలీసులకు తెలిపిన వారికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

పోలీసులు రిలీజ్ చేసిన పోస్టర్ లో పేర్కొన్న మావోలు వీరే
ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు ఏజెన్సీలో పోస్టర్లను రిలీజ్ చేసిన పోలీసులు నక్సలైట్ వ్యవస్థను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలలో బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్న, కంకణాల రాజి రెడ్డి అలియాస్ వెంకటేష్ అలియాస్ ధర్మన్న, ముచకి ఉంగల్ అలియాస్ రఘు అలియాస్ సుధాకర్, కొవ్వాసి గంగా అలియాస్ మహేష్ అలియాస్ జనార్ధన్, కుంజా వీరయ్య అలియాస్ లచ్చయ్య అలియాస్ లక్ష్మణ్, కొవ్వాసి రాము, కుర్సం మంగు అలియాస్ భద్ర అలియాస్ పాపన్న, మడకం సన్నల్ అలియాస్ మంగతూ ఉన్నారు.

సమాచారమిస్తే నగదు బహుమతి.. సహకరిస్తే చట్టరీత్యా చర్యలు
వీరు ములుగు డివిజన్ లో తిరుగుతున్నారని, వీరి ఆచూకీ తెలియజేసిన వారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసులు వెల్లడించారు. అలా కాకుండా మావోయిస్టులకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సమాచారం పోలీసులకు.. బహుమతి మీకు అంటూ నక్సలైట్లకు చెక్ పెట్టడానికి కొత్త కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులు, అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టడమే కాకుండా, ప్రజలను నక్సలైట్లకు సహకరించకుండా ఉండేలా పక్కా స్కెచ్ వేశారు.












Click it and Unblock the Notifications