లాయర్ దంపతుల హత్య : పుట్ట మధుకు షాక్... కోర్టు ఆదేశాలతో పుట్ట శైలజపై కేసు నమోదు...
పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు షాక్ తగిలింది. మంథని కోర్టు ఆదేశాల మేరకు పుట్ట మధు సతీమణి,మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజపై కేసు నమోదైంది. న్యాయవాద దంపతులు వామన్రావు-నాగమణి దంపతుల హత్య కేసు విచారణ సందర్భంగా... నిందితుడు బిట్టు శ్రీనుతో కోర్టు ఆవరణలో ఆమె వీడియో కాల్ మాట్లాడించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ దీనిపై కోర్టుకు ఫిర్యాదు చేయడంతో... ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.
లాయర్ దంపతుల హత్య : అంతా రెండు గంటల్లోనే జరిగిందా? ఒక్కడినే చంపాలనుకున్నారు...కానీ..
ఎస్సై ఫిర్యాదుతో శైలజపై కేసు...
గత నెల 19 మంథని కోర్టులో వామన్రావు-నాగమణి దంపతుల హత్య కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పుట్ట శైలజ... బిట్టు శ్రీను దగ్గరికి వచ్చి మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు,బిట్టు శ్రీనుతో ఆమె వీడియో కాల్ కూడా మాట్లాడించిందన్న ఆరోపణలున్నాయి. పుట్ట శైలజ తీరుపై మంథని ఎస్సై ప్రవీణ్ కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. తాను వారించినా వినకుండా నిందితుడు బిట్టు శ్రీనుతో ఆమె ఫోన్ కాల్ మాట్లాడించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సెక్షన్ 186 కింద పుట్ట శైలజపై కేసు నమోదైంది.
కొనసాగుతున్న కేసు దర్యాప్తు...
వామన్ రావు-నాగమణి దంపతుల హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా ఆదేశించాలని గత నెలలో యాంటి కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనం.. ఈ అంశం తెలంగాణ జ్యుడిషియరీ పరిధిలో ఉందని పేర్కొంది. కాబట్టి వామన్ రావు దంపతుల హత్య అంశంలో అభ్యంతరాలను హైకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని సూచించింది. అంతకుముందు,ఈ కేసుపై విచారణ సందర్భంగా.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని న్యాయస్థానం తెలిపింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఫిబ్రవరి 17న హత్య.. పుట్ట మధుపై ఆరోపణలు...
పెద్దపల్లి జిల్లా కల్వచర్ల సమీపంలో ఫిబ్రవరి 17న పట్టపగలు న్యాయవాద దంపతులు వామన్ రావు-నాగమణి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దంపతులిద్దరూ మంథని కోర్టుకు హాజరై తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో వారిపై దాడి జరిగింది. నిందితులు వేట కొడవళ్లతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో మంథని టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీను,అక్కపాక కుమార్,శివందుల చిరంజీవి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కీలక నిందితులుగా ఉన్నారు. హత్యకు బిట్టు శ్రీను కారు,కత్తులు సమకూర్చాడన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో బిట్టు శ్రీనుపై ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష పార్టీలు పుట్ట మధుపై కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పుట్ట మధు ప్రోద్భలంతోనే హత్య జరిగిందని కాంగ్రెస్,బీజేపీ నేతలు గతంలో ఆరోపించారు.