రోహిత్ ఆత్మహత్య: వీడియో.. ఏబీవీపీ నేతలతో వాగ్వాదం ఇదే...
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోహిత్ ఏఎస్ఏ సంస్థలో ఉన్నారు. ఇతనికి, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన వాగ్వాదం వీడియో మూడు రోజుల విడుదలైంది. ఇది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
ఈ వీడియో బయటకు రావడాన్ని ఏఎస్ఏ విద్యార్థులు తప్పుబట్టారు. కావాలనే ఏబీవీపీ వాళ్లు ఈ వీడియోను బయటకు విడుదల చేశారని ఆరోపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. వస్తున్న వార్తల మేరకు ఆ వీడియోలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఇదీ...
రోహిత్: హిందుత్వ గానీ, ఏబీవీపీ గానీ కనబడితే ఎదిరించమని నా సంస్థ నేర్పింది. ఇంకా ఏం నేర్పిందంటే.. హిందుత్వగానీ, హిందువులు గానీ హిందు పేరు చెప్పి మైనార్టీల పైకి వచ్చేవాళ్లు గానీ, దళితుల గురించి మాట్లాడేవాళ్లు గానీ కనబడితే ఎదిరించమంది.
ఏబీవీపీ విద్యార్థులు: అదంతా కాదు నువ్వు మా బ్యానర్ ఎందుకు చింపావు.. అదే అడుగుతున్నాం.
రోహిత్: అవును నేనే చింపాను. ఏబీవీపీ బ్యానర్ కనబడింది చింపేశాను.
ఏబీవీపీ విద్యార్థులు: ఎందుకు చింపావు కారణం చెప్పు
రోహిత్: కాషాయ రంగు కనబడింది. హిందూ కలర్ కనబడింది. కోపమొచ్చి చించేశాను.
ఏబీవీపీ విద్యార్థులు: రేపు మీ ఇంట్లో కాషాయ రంగు చీరలు ఉంటే చించుతావా
రోహిత్: చించుతాను.
ఏబీవీపీ విద్యార్థులు: నీకు నచ్చలేదని మావి చించావు. మేం కూడా మీవి చించొచ్చా. మేం అలా చించితే మీ బ్యానర్ ఒక్కటీ ఉండదు.
రోహిత్: చించుకోండి. చూసుకుందాం.
ఏబీవీపీ విద్యార్థులు: మాకు చించవలసిన అవసరం లేదు. మేం పద్ధతిగా బ్యానర్లు కట్టుకున్నాం. సిగ్గుండాలి మనిషికి. ఏం చదువుతున్నావు.. పిహెచ్డినా.. మనిషికి కామన్ సెన్స్ లేదు. సర్లే చూసుకుందాం అన్నావుగా.. చూసుకుందాం.