పంజాబ్లో ప్రధాని మోడీకి పట్టిన గతే.. తెలంగాణ బీజేపీ నేతలకు: దానం నాగేందర్ సంచలనం
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై బీజేపీ నాయకులు విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.
పంజాబ్లో ప్రధాని మోడీ గతేనంటూ దానం నాగేందర్ వార్నింగ్
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను దానం అందజేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడారు. బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఏ గతి పట్టిందో తెలంగాణలో బీజేపీ నేతలకు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ బురదలో కూరుకుపోయిందన్న దానం.. ఆ బురదలో రాయి వేసి బురదమయం కాలేమన్నారు.
ప్రవర్తన మార్చుకోండి.. బీజేపీ నేతలకు దానం నాగేందర్ హెచ్చరకి
రాష్ట్ర నేతలు అవగాహన లేకుండా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను చదివి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అపహాస్యం పాలవుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులే ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్లో చెత్త ఉందని మాట్లాడుతున్న విజయశాంతి.. ఢిల్లీ నుంచే చెత్త వస్తుందని గమనించాలని హితవు పలికారు దానం నాగేందర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వ్యక్తి కాదని.. తెలంగాణ శక్తి అన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు ప్రవర్తన మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని దానం నాగేందర్ హెచ్చరించారు.
పంజాబ్లో 20 నిమిషాలపాటు చిక్కుకున్న ప్రధాని
కాగా, బుధవారం ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడంతో ప్రధాని, ఆయన కాన్వాయ్ సుమారు 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్పైనే చిక్కుకుపోయింది. దీంతో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీకి భౌతికంగా హాని కలిగించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వరుస ఓటములతో ఆ పార్టీ ఉన్మాదానికి దిగుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భద్రతా వైఫల్యం ఏమీలేదని చెబుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా పంజాబ్ సర్కారు మద్దతు పలుకుతున్నారు. ఫిరోజ్పూర్లో భద్రతా వైఫల్యానికి బాధ్యున్ని చేస్తూ అక్కడి సీనియర్ ఎస్పీని సస్పెండ్ చేసింది పంజాబ్ ప్రభుత్వం.