భూమి లేని రైతు రుణాలకు మాఫీ నో: ఈటెల
హైదరాబాద్: భూమి లేకుండా వ్యవసాయం కింద రుణాలు తీసుకున్నవారికి మాఫీ వర్తించదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అర్హులైనవారందరికీ రుణమాఫీ అమలు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసిన తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు. నకిలీ పాస్ బుక్కులతో రుణాలు తీసుకున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. రాష్టర్ ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక తెప్పిస్తోందని చెప్పారు. ప్రజల డబ్బును నిజమైన పేదలకు, రైతులకు అందించాలన్నదే తమ లక్ష్యమని ఈటెల అననారు.

గత ప్రభుత్వాల హయాంల్లో ఏది ఇచ్చినా ఉన్నవాళ్లకు, రాజకీయ నాయకులకే చేరిందని ఆయన విమర్శించారు. త్వరలో సబ్ కమిటీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమవుతుందని ఆయన అన్నారు. ఈ నెలాఖరులోగా రుణ మాఫీని అమలు చేస్తామని చెప్పారు.
తెలంగాణలోని రైతుల రుణ మాఫీ నూటికి నూరు శాతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రివర్గ ఉప సంఘం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు.
సెప్టెంబర్ చివరినాటికి రుణమాఫీ చేసి తీరుతామని శ్రీనివాస రెడ్డి చెప్పారు రుణమాఫీకి సంబంధించి జిల్లాల నుంచి వివరాలు తెప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications