'రూ.500నోటుతో తిప్పలు' : రిజర్వ్ బ్యాంకు ఎదుట జనం బారులు
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటనతో.. సామాన్యులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఎక్కువ డినామినేషన్ నోట్లను రద్దు చేయడంతో.. ప్రస్తుత అవసరాల కోసం సామాన్య జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇక దొరికిందే సంధు అని భావిస్తున్న కొన్ని హోటళ్లు, పెట్రోలు బంకులు, రవాణా వాహనాలు వినియోగదారులను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈరోజు పరిస్థితిని గమనిస్తే.. రూ.500, రూ.1000నోట్లు కలిగివున్న కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఎదుట బారులు తీరడం కనిపించింది. తమవద్దనున్న నోట్లను మార్పించుకుని వంద నోట్లను పొందడానికి వారంతా అక్కడికి రాగా.. ఈరోజు, రేపు సెలవు దినం అంటూ సిబ్బంది వారిని అక్కడినుంచి పంపించేస్తుండడంతో.. తీవ్ర ఆవేదన చెందుతూ వెనుతిరుగుతున్నారు. వారిలో కొందరిని వన్ఇండియా.కామ్ పలకరించే ప్రయత్నం చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సంజయ్ (మొయినాబాద్ వాసి)
రిజర్వ్ బ్యాంక్ వద్దకు ఎందుకు వచ్చారంటూ సంజయ్ ను ప్రశ్నించగా.. తాను మొయినాబాద్ వాసినని, వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్ వచ్చానని, అయితే అకస్మాత్తుగా రూ.500, రూ.1000 నోట్లను నిషేధించడంతో.. తాను కనీసం టిఫిన్ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన వద్దనున్న నోట్ల మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్ కేంద్రం వద్దకు వచ్చినట్టు చెప్పాడు. అయితే రెండు రోజుల పాటు సెలవంటూ సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో.. ఇప్పుడు మా పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నారు సంజయ్.

రూ.500కు రూ.100 నొక్కేస్తున్నారు:
కేంద్ర ఆకస్మిక నిర్ణయాన్ని పలు హోటళ్లు, వాహనాదారులు క్యాష్ చేసుకుంటున్నారని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. టిఫిన్ చేసేందుకని హోటల్ కు వెళ్లిన సంజయ్.. అందుకోసం రూ.500 నోటు చెల్లించారు. టిఫిన్ ఖర్చులు రూ.25 పోను మిగతా మొత్తాన్ని ఇవ్వాల్సిందిపోయి, వంద నోట్లు ఇస్తున్నందుకు గాను తిరిగి రూ.400 మాత్రమే చెల్లించారు హోటల్ సిబ్బంది. ఈ విషయాన్ని సంజయ్ స్వయంగా వెల్లడించాడు.

రిజర్వ్ బ్యాంకు వద్ద గుమిగూడిన జనం :
సంజయ్ లాగే మరికొంతమంది వ్యక్తులు రూ.500నోట్లు, రూ.1000నోట్లు మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆటోలో అక్కడకు వచ్చిన ఓ మహిళా.. అతనికి రూ.500 నోటు ఇవ్వడంతో.. తీసుకోవడానికి అతగాడు నిరాకరించాడు. దీంతో ఆటో వ్యక్తికి ఎలా డబ్బులు చెల్లించాలో అర్థంగాక కాసేపు తలపట్టుకుంది సదరు మహిళ.

శ్రీకృష్ణ థియేటర్ నిర్వాహకుడు రాజు అభిప్రాయం :
రూ.500, రూ.1000నోట్ల నిషేధంతో థియేటర్స్ వద్ద పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని వెళ్లగా.. తమ యజమాని ఆ నోట్లను తీసుకోవద్దని ఆదేశించినట్టుగా ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ నిర్వాహకుడు బి.రాజు అభిప్రాయపడ్డారు.
అయితే.. ప్రస్తుతం నడుస్తోన్న సినిమాకు అంతగా కలెక్షన్స్ లేవని, కాబట్టి పెద్ద నోట్లు ఎక్కువగా రావడం లేదని చెప్పారు రాజు. మోడీ ప్రకటన ఇప్పుడు వెలువడినప్పటికీ.. రాజకీయ నేతలందరికీ ఈ విషయం ఎప్పుడో చేరిపోయి ఉంటుందని, ఆయన సహచర నిర్వాహకుడైన మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. సామాన్య జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఇంత ఆకస్మికంగా నిర్ణయం ప్రకటించాల్సి కాదనేది ఆయన అభిప్రాయం.

ఆటోవాలా 'బాబా' అభిప్రాయం :
బ్లాక్ మనీని అరికట్టడానికి మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే కావచ్చు గానీ సామాన్యులకు మాత్రం కష్టాలు తప్పట్లేదు. ఆటో ఎక్కిన చాలామంది రూ.500 నోట్లే ఇస్తున్నారు. వాటిని తీసుకుంటే.. బ్యాంకు లేదా ఏటీఎం ద్వారా వాటిని మార్పిడి చేసుకోవడం ఒకింత ఇబ్బంది. అందుకే.. రూ.500 నోటు ఇవ్వబోయిన ఒకరిద్దరు ఆటో ప్యాసింజర్స్ నుంచి వారి ఫోన్ నంబర్స్ తీసుకుని తర్వాత ఇవ్వాల్సిందిగా కోరాను. అంతకుమించి ఏం చేయలేం కదా!












Click it and Unblock the Notifications