కేసీఆర్ మాట నిలబెట్టుకో.. కవితతో రాజీనామా చేయించు: మధుయాష్కీ
హైదరాబాద్: లిక్కర్ స్కాంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ తీవ్రంగా మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో తప్పుడు ఆరోపణలంటున్న కవిత రాజీనామా చేసి విచారణకు సహకరించాలన్నారు మధుయాష్కీ. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కేటీఆర్, కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారని గుర్తు చేశారు.
కవితతో రాజీనామా చేయించండి కేసీఆర్..: మధుయాష్కీ
ఢిల్లీలో మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీమానా చేయించాలని డిమాండ్ చేశారు. కవితకు నిజాయితీ ఉంటే బీజేపీ నేతలపై పరువునష్టం కేసు వేయాలన్నారు. కేసీఆర్ కుటుంబంపై కేంద్రం ఈడీ, సీబీఐ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ డిమాండ్ చేశారు.
కవిత మరోసారి తప్పించుకునే యత్నం: మధుయాష్కీ
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే కవితతో రాజీమానా చేయించాలి. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఉద్యమ ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో విభజన హామీలపై పోరాటం చేశారా? అని నిలదీశారు మధుయాష్కీ. నిజామాబాద్లో ప్రేమసాగర్ అనే వ్యక్తి వెలమ అసోసియేషన్కు రూ.కోటి ఎక్కడి నుంచి ఇచ్చారని మాజీ ఎంపీ మధుయాష్కీ ప్రశ్నించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబం, ఆయన కుమార్తె కవితకు సంబందాలున్నాయని బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కాంతో సంబంధం లేదంటున్న కవిత
అయితే, కవిత మాత్రం బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కుమర్తెను బద్నాం చేస్తే.. కేసీఆర్ తగ్గుతారనుకుంటున్నారు.. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదని కవిత అన్నారు.
ఆయన్ని మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు.. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడేది లేదన్నారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్ను తగ్గించడానికే బీజేపీ కుట్రం చేస్తోంది.. ఏ దర్యాప్తుకైనా మేం సిద్ధమే అని కవిత స్పష్టం చేశారు.