కెటిఆర్కు ఆంధ్రావాళ్లతోనే సరిపోతుంది: యాష్కీ, ప్రభుత్వం వల్లే!: కోదండ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆంధ్రా వారితో వ్యాపారం చేయడానికే సమయం సరిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ బుధవారం మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ దోపిడీ జరుగుతోందన్నారు. ఆంధ్ర ప్రాంతం వారితో వ్యాపారానికే కెటిఆర్కు సమయం సరిపోతోందని, ఇక రైతులకు ఏం సాయం చేస్తారని భగ్గుమన్నారు. రైతులకు సాయం విషయంలో ప్రభుత్వం కసాయిలా వ్యవహరిస్తోందన్నారు. ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్ పైన తాను అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ చేశారు.
చర్చ జరగాలనే: కోదండరాం
రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ జరగాలనే తాను హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ కోదండరాం చెప్పారు. వరంగల్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున కోదండరాం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
తెలంగాణను ముందుంచుదాం: ఎంపీ కొత్త
తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే ముందుంచుదామని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొండపాకలో జలహారం పథకానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త మాట్లాడారు.
వాటర్ గ్రిడ్ దేశంలోనే అద్భుతమైన పథకమన్నారు. ఇంటింటికీ తాగునీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగబోమని చెప్పిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రభుత్వ పథకాలపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. అందరం కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని అన్ని రాష్ట్రాల కంటే ముందుంచుదామన్నారు.